ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ మురళీధర్రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేపట్టి నివేదికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, ఎస్.అప్పారావు (బీఎస్పీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజశేఖర్ (సీపీఎం), డీఎన్వీ భద్రరావు (తెదేపా), ఆర్.వెంకటేశ్వరరావు (వైఎస్సార్ సీపీ) తదితరులు పాల్గొన్నారు.