దేవాలయాల అద్భివృద్ధి , ఆస్తుల పరిరక్షణ పై పూర్తి స్థాయి లో దృష్టి పెదుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో ఏ ఏ దేవాలయాలు అభివృద్ధికి అవకాశం ఉందో నియోజక వర్గం వారీగా ఎమ్మెల్యే అంగీకారం తో ప్రతిపాదనలు పంపాలని దేవాలయాల అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి కలెక్టరేట్ ఆడిటోరియం లో ప్రజాప్రతినిధులతో కలసి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల భద్రతకు సి సి కెమెరాలు, పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజక వర్గం వారీగా ఉన్న దేవస్థానాల స్థితి గతుల పై పూర్తి నివేదికను 15 రోజుల్లోగా అందించాలని, తదుపరి ఏ గుడికి ఎలాంటి అభివృద్ధి అవసరం , ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. అన్ని దేవాలయాల ఈ.ఓ లు ఆయా ప్రజా ప్రతినిధులతో మాట్లాడి నివేదిక నివ్వాలన్నారు. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని భక్తుల మనో భావాల కనుగుణంగా భక్తులను భగవంతుని సన్నిధికి చేర్చేలా ఈ-పూజ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. టి టి డి ఆధ్వర్యం లో ఉత్తరంధ్రకు చెందిన మూడు జిల్లాల్లో వెయ్యి దేవాలయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 100 కుటుంభాలు ఉన్న ఛోట 10 లక్షల వ్యయం తో ఎస్.సి., ఎస్.టి , బి.సి , మత్స్యకార గ్రామాల్లో అక్కడి ప్రజల కోరిక మేరకు హిందూ దేవాలయాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం క్రింద జిల్లా నుండి కనీసం 100 ప్రాంతాలను ఎంపిక చేసి 15 రోజుల్లో నివేదిక పంపాలని అన్నారు.
జగనన్న కాలనీల్లో దేవాలయాల నిర్మాణం: రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం అబినందనీయమని టీటీడీ ఆధ్వర్యం లో చేపట్టనున్న దేవాలయాలను జగనన్న కాలనీలలో కూడా నిర్మించాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. రాష్ట్రం లో 17 వేల జగనన్న కాలనీలు గ్రామాలుగా మారాయని, అన్నీ సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, ఈ కాలనీలు వర్ణ, జాతి బేధాలు లేకుండా అందరికీ సమానంగా నిర్మించడం జరిగిందని, అక్కడ టీటీడీ ద్వారా ప్రజలు కోరిన విధంగా దేవాలయాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. మొదటి దశ లో కనీసం 100 దేవాలయాల నిర్మాణాలకు శాసన సభ్యుల అంగీకారంతో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం ముఖ్యమని, దేవాలయాల సిబ్బంది, అధికారులు వారి పరిధి లోనున్న ప్రతి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి దేవాలయాల భూములు, ఆభరణాలు,ఇతర ఆస్తుల పై సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు. ఏ ఏ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు లు ఏర్పాటు చేయవలసి ఉందో శాసన సభ్యుల సిఫార్శు లతో ప్రతిపాదనలు మంత్రివర్యులకు పంపాలని సూచించారు. విజయనగరం ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లోకి దేవాలయం పక్కనున్న దుకాణాలను తరలించి అబివృద్ధి చేయడానికి దేవాదాయ శాఖ సహకరించాలని కోరారు. రహదారి విస్తరణకు 5 అడుగులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, మరో 5 అడుగులు ఇస్తే సమస్య తీరిపోతుందని అన్నారు. దుకాణాల వారికి ఇబ్బంది లేకుండా, పండగల్లో ఇరుకుగా లేకుండా అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని, మరో 5 అడుగులు వెనక్కు వెళ్లడానికి దేవాదాయ కమిషనర్ అనుమతిని ఇవ్వాలని కోరారు.
పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ , నెల్లిమర్ల శాసన సభ్యులు బద్దుకొండ అప్పల నాయుడు, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు , ఎస్.కోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాస రావు వారి నియోజక వర్గాల్లో నున్న దేవాలయాల సమస్యలు, అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ జి.సి. కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు, ప్రత్యేక అధికారి భ్రమరాంబ, డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాధవి, మాన్సాస్ ఈ.ఓ వేంకటేశ్వర రావు, జిల్లా సహాయ కమిషనర్ వినోద్ కుమార్, పలు దేవాలయాల ఈ.ఓ లు పాల్గొన్నారు.