ఉపాధిహామీ పనులు వేగం పెంచాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-06-11 14:35:25
విశాఖ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, వివిధ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ వెల్నెస్ క్లినిక్ నిర్మాణాలు, వైయస్సార్ జలకళ పథకాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 3 లక్షల 91 వేల మందికి పని కల్పిస్తున్నట్లు చెప్పారు. జూన్ నెలాఖరుకు కోటి 25 లక్షల పని దినాలను సాధించే దిశగా పనులను వేగవంతం చేయాలన్నారు. వైయస్సార్ జలకళ పథకంలో రైతులకు 200 వ్యక్తిగత సాగు బోరుబావులను త్రవ్వించాలని ఆదేశించారు. ఈనెల 16 నుండి నిర్వహించే భవన నిర్మాణ పక్షోత్సవాలు సందర్భంగా అవగాహన కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గ్రామ సచివాలయాలు, మొదటి విడత మిల్క్ కూలింగ్ సెంటర్లు జూన్ 30వ తేదీకి రైతు భరోసా కేంద్రాలు జూలై 8 వ తేదీకి వైయస్సార్ వెల్నెస్ క్లినిక్ లు జూలై31 తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి లక్ష్యాలను సాధించే దిశగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం పి.డి. సందీప్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ. రవికుమార్, భూగర్భ జలవనరుల శాఖ డి.ఈ. తదితరులు పాల్గొన్నారు.