ప్రతీ నిరుపేదకు సొంతిల్లే లక్ష్యం..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-06-14 15:35:01
ప్రతి పేదవారికి స్వంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ 4 వార్డు కాపులుప్పాడలో 168 ఇళ్ళతో నిర్మించనున్న జగనన్న కోలనీ గృహాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం మన రాష్ట్రంలోనే లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదవారికి 60 గజాల భూమిని ఇస్తే, ఇంతకుముందు భూములు కబ్జా చేసిన నాయకులు అది చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి 4 వ వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు పాల రమణ రెడ్డి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.