సచివాలయాలు నేడు అత్యంత కీలకం..


Ens Balu
4
శ్రీకాకుళం, Andhra Pradesh, India
2021-06-14 16:14:34

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయాలు నేడు అత్యంత కీలకంగా మారాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్త అన్నారు. సోమవారం శ్రీకాకుళం  నగరంలోని కంపోస్టు కాలనీ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందించేందుకు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అనంతరం సచివాలయంలో గృహనిర్మాణ శాఖకు సంబంధించిన డేటా ఎంట్రీలను స్వయంగా పరిశీలించారు. డేటా ఎంట్రీలలో ఎటువంటి సమస్యలు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని, తద్వారా మార్పులు చేసేందుకు అవకాశం కల్పించబడుతుందని ఆయన చెప్పారు. అనంతరం వాలంటీర్లతో మాట్లాడుతూ గృహ లబ్దిదారులను ఎంపికచేయడంలో వాలంటీర్లు విశేష కృషిచేసారని, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆదిశగా వాలంటీర్లు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు ఇంకా మెరుగైన సేవలు అందించి ప్రభుత్వం ప్రకటించిన సేవా రత్న, సేవా వజ్ర పురష్కారాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు డా. కె.శ్రీనివాసులు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ రామ్మోహన్, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డా. వెంకటరావు, సిబ్బంది గణేష్ తదితరులు పాల్గొన్నారు.