వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకానికి అర్హత గల లబ్దిదారులు ఎవరైనా ఉంటే నెల రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి 3వ విడత వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద రాష్ట్రంలో 2.48 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పది వేల రూపాయలు భీమా, ఫిట్ నెస్ సర్టిఫికేట్, మరమ్మత్తులు, తదితర ఖర్చులకు ఉపయోగపడుతోందని వారికి ఆర్థిక సహాయంగా అందించినట్లు పేర్కొన్నారు. సలహాలు, సందేహాలు, ఫిర్యాదులకు 1902 ఫోన్ నంబర్ కు తెలియజేయవలసినదిగా ఆయన కోరారు. అందరూ ట్రాఫిక్ నింబంధనలు పాటించాలని, అన్నీ కండీషన్ లో పెట్టుకోవాలని చెప్పారు. ఏ ఒక్కరూ మధ్యం సేవించి వాహనం నడుపరాదని ఆయన సూచించారు. అనంతరం 3వ విడత వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకాన్ని లబ్దిదారుల ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, ఉప రవాణా కమీషనర్ డా.వడ్డి సుందర్, డిఎస్పి సి.హెచ్.జి.వి.ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, రవాణా శాఖ అధికారులు శివరాం, వేణుగోపాల్, చౌదరి సతీష్, రాజాపు అప్పన్న, తదితర అధికార, అనాధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. అనంతరం రూ. 14.69 కోట్ల రూపాయల చెక్కును లబ్దిదారులకు అందజేశారు.