విజయనగరం ఈ నెల 26వ తేదీన వర్చువల్ విధానంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ద ఛైర్మన్ జి. గోపి తెలిపారు. ఈ మేరకు బుధవారం బ్లూ జీన్ యాప్ సాయంతో వర్చువల్ విధానంలో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ, బ్యాంకుల అధికారులు, న్యాయవాదులు క్షక్షిదారులు సహకరించి ఈ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని సూచించారు. సివిల్, క్రమినల్ కేసులు, బ్యాంకు కేసులు, మోటారు ప్రమాద భీమా కేసులు, ఎక్సైజ్ కేసులు, మనీ కేసులు, చెక్కబౌన్సు కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, విద్యుత్ మరియు టెలిఫోన్ కేసులను వర్చువల్ విధానంలో జరిగే ఈ అదాలత్లో ఇరు పార్టీల సమ్మతితో రాజీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. లక్ష్మీరాజ్యం, విజయగనరం బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్ పి. హరగోపాల్, సీనియర్ న్యాయ వాదులు, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.