విశాఖ జిల్లాలో ఈ నెల 26న భారత ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరు జిల్లాలో ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భముగా ఏర్పాట్లుపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి 26వ తేదీన ఉ.11.45 గంటలకు జిల్లాకు రానున్నారని, పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేస్తారన్నారు. ఎయిర్ పోర్టులో రిసెప్షన్ కు అవసరమైన ఏర్పాట్లు గావించాలన్నారు. పోర్టు గెస్ట్ హౌస్ లో వారి బస చేయినున్నందున ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లలో ఎటువంటి అలసత్వం కూడదని ప్రతి ఒక్క అధికారి వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహనతో ముందుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఎటువంటి ఇబ్బంది, సమస్య రాకుండా జాగ్రత్త వహించాలన్నారు . పోర్టు గెస్ట్ హౌస్ లో నిరంతర విద్యుత్తు సరఫరా, నీటి సదుపాయము, ఎసి, బోజన ఏర్పాట్లు గావించాలన్నారు. ఎయిర్ పోర్టు నుండి పోర్టు గెస్ట్ హౌస్ వరకు రోడ్లు సరిగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని జి.వి.ఎం.సి ఇంజనీర్ల ను ఆదేశించారు. వారి పర్యటనకు అవసరమైన వాహనాలను ఏర్పాటు గావించాలని డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను ఆదేశించారు. అంబులెన్స్, డాక్టర్లు, ఇతర వైద్య సదుపాయాలను నిబంధనల ననుసరించి ఏర్పాటు గావించాలని కె.జి.హెచ్. సూపరింటెండెంట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 27వ తేదీన ఉప రాష్ట్రపతి వర్చువల్ మోడ్ లో పాల్గొను కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు గావించాలని ఎన్.ఐ.సి అధికారులను ఆదేశించారు. పర్యటన , కార్యక్రమాలలో విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది అందరూ కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి, డి.ఆర్.ఓ. ఆర్.గోవిందరావు, జి.వి.ఎం.సి., పోలీసు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.