ఇళ్ల నిర్మాణాలపై ద్రుష్టిసారించాలి..
Ens Balu
3
Kakinada
2021-06-24 15:16:22
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి లేఔవుట్ల పరిస్థితి, మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డివిజన్, మండల స్థాయి హౌసింగ్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ, కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 131 లేఔవుట్లలో 33,590 మంది లబ్ధిదారులకు తొలిదశలో గృహ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అన్ని లేఅవుట్లలో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నీరు, విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. లేఅవుట్లలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎడిసి సిహెచ్ నరసింహారావు, కాకినాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.