రాష్ట్రానికే తలమానికంగా విమ్స్ హాస్పటిల్...
Ens Balu
4
విమ్స్ హాస్పటిల్
2020-09-01 19:36:54
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆసుపత్రిని రాష్ట్రానికే తలమానికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపి ఎమ్.వి.వి. సత్య నారాయణలతో విమ్స్ ను సందర్శించారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వసతులు, అందిస్తున్న చికిత్స లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలోని టిమ్స్, గుంటూరులో వున్న ఎయిమ్స్ ఆసుపత్రులకు మించి అన్నిరకాల చికిత్సలు, ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ ఆసుపత్రి తరువాతి కాలంలో అలక్ష్యం చేయబడిందని, ప్రైవేటు పరం చేసేందుకు కూడా ఆలోచన చేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన తరువాత విశాఖపట్నాన్ని అభవృద్ధి చేసే క్రమంలో విమ్స్ పై ప్రత్యేక దృష్ఠి పెట్టారని చెప్పారు. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు విమ్స్ సేవలు తీసుకున్నారంటే, ఆసుపత్రిని అభివృద్ధి చేసినందునే సాధ్యపడిందని పేర్కొన్నారు. విమ్స్ కు అనుబంధంగా మెడికల్ కాలేజి, ఇతర అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోనే గొప్ప వైద్య సంస్థను రూపొందించడమే ముఖ్యమంత్రి ఆశయమని చెప్పారు.
సీఎం విమ్స్ ఆసుపత్రిని పరిశీలించామన్నారు. 305 పడకలు గల వార్డులు తనిఖీ చేశామని. రోగులతో మాట్లాడామని చెప్పారు. వైద్యం సంతృప్తి కరంగా వుందని, మంచి ఆహారం అందిస్తున్నారని, మెరుగైన చికిత్స చేస్తున్నట్లు తెలిపారన్నారు. అధునాతన వైద్య పరికరాలు బాగున్నాయని, డాక్టర్లు, సిబ్బంది సేవలు ఆకట్టుకున్నాయన్నారు. అయితే ఆసుపత్రిలో వైద్యలు, నర్సులు, సిబ్బంది కొరత వుందన్నారు. వార్డుకు 16 పడకలు కలిగిన 12 ఐ.సి. యు. వార్డులు, 10 ఐసోలేషన్ వార్డులు, ఒక డయాలసిస్ సెంటర్ వుందని చెప్పారు. వైద్యులను, సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని నియమించాల్సి వుందన్నారు.
తక్కువ సిబ్బందితో చక్కటి చికిత్స అందజేస్తున్న డైరక్టర్ డాక్టర్ వరప్రసాద్, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పిపిఈ కిట్స్ ధరించి 6 గంటలు పనిచేయడం, ఓపికతో చికిత్స చేయడం వంటి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. త్వరలోనే డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎం.పి. ఎమ్.వి.వి. సత్యనారాయణ, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, జాయింట్ కలెక్టరు (అసరా) ఆర్.గోవిందరావు, నగర అధ్యక్షలు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్, కెకెరాజు, అక్కరమాని విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.