హౌసింగ్ గ్రౌండింగ్ కి పక్కా ఏర్పట్లు..


Ens Balu
1
Vizianagaram
2021-06-30 13:53:22

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజూరు చేసిన గృహాలను ప్రారంభించడానికి క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి.  అధికారులు, ప్రజా ప్రతినిధులు  గత మూడు రోజులుగా మేళా ఏర్పాట్ల పై నిమగ్నమై ఉన్నారు.  లే అవుట్ల   తయారీ,  ప్లాట్ల  మార్కింగ్,   షామియానా, నీరు, భూమి పూజలకు అవసరమగు గోతులు,  ఇసుక, సిమెంట్, ఇతర పూజా సామాగ్రిని  లే అవుట్ల  వద్ద సిద్ధం చేసారు.   లబ్ది దారులను వారి ప్లాట్ల వద్దకు  తీసుకురావడానికి , వార్డ్, గ్రామ స్థాయి కమిటీలను వేసి వాలంటీర్ల కు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.    ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై వారిని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వచ్చేలా ఏర్పాట్లను గావించారు.  నియోజక వర్గం ఇంచార్జ్ లు, మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యం లో లబ్ది దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా వారి ప్లాట్ వద్దకే వెళ్లి పూజ చేసుకొని,  నిర్మాణాలను  చేపట్టేలా  చేసారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం రవాణా ఏర్పాట్లను గావిస్తున్నారు.  జిల్లాలో మొదటి విడత లో  928 లే అవుట్లలో 98 వేల 286 ఇళ్ళను  మంజూరు చేయడం జరిగింది. కోర్ట్ కేసు లు, ఇతర కారణాలతో  కొన్ని స్థలాలు పెండింగ్  లో ఉన్నప్పటికీ 75 వేల మందికి ప్రస్తుతం గృహ నిర్మాణాలను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం జూలై 1,3,4 తేదీలను మేళా కోసం ప్రకటించినప్పటికీ మొత్తం ప్రారంభాలన్ని 1 వ తేదీనే పూర్తి అయ్యేలా కలెక్టర్  ప్రత్యెక వ్యూహ రచన చేసారు.  1 న అవకాశం లేక  మిగిలిపోయిన వారు  3,4 తేదీలలో ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసారు.  జిల్లాలో 75 వేల గృహాలకు ఈ మూడు  రోజుల్లో ప్రారంభించాలని లక్ష్యంగా చేసారు.  గృహం మంజూరైనప్పటికి రిజిస్ట్రేషన్, జియో  టాగింగ్, మాపింగ్ జరగని వారికీ కూడా ఈ మేళా లో ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పిస్తూ  మంజురైన అన్నిటిని ప్రారంభించాలని  కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు.  

నియోజక వర్గాల  పర్యవేక్షణకు ఐ.ఏ.ఎస్ అధికారులు..
జిల్లాకు ప్రత్యెక పర్యవేక్షణాధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను  ప్రభుత్వం నియమించగా, జిల్లా నుండి జే.సి (రెవిన్యూ) గజపతి నగరం,  బొబ్బిలి  నియోజక వర్గాలకు, జే.సి అభివృద్ధి డా. మహేష్ కుమార్ ను నెల్లిమర్ల, చీపురుపల్లి, జే.సి ఆసరా జే. వెంకట రావు కు సాలూరు నియోజక వర్గానికి ఇంచార్జ్ లుగా నియమించారు. జే.సి హౌసింగ్ మయూర్ అశోక్ ను విజయనగరం , ఎస్.కోట  నియోజకవర్గాలకు కేటాయించగా , ఐ టి డి ఎ ప్రోజ్ర్ట్ అధికారి కుర్మనాద్ ను పార్వతి పురం, కురుపాం కు నియమించారు.  వీరితో పాటు  ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని, మండల ప్రత్యేకాధి కారులను   నియమించారు. 

పించన్ల పంపిణీ మధ్యాహ్నం 2 గంటల కు మార్పు..
గృహ నిర్మాణాల  మేళా కు  లబ్దిదారులు, వాలంటీర్లు హాజరవుతున్న దృష్ట్యా  ఉదయాన్నే పంపిణీ చేయవలసిన పించన్ల పంపిణీ  మధ్యాహ్నం 2 గంటల తర్వాత  పంపిణీ  చేయడం జరుగుతుందని  సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్  తెలిపారు.  గృహ మేళా పూర్తి అయిన వెంటనే వాలంటీర్లంత పించన్ల పంపిణీ కి హాజరు కావాలని  ఆదేశించారు.