శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను శుక్రవారం నాడు తిరుమలలోని గోశాలలో టిటిడి ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముందుగా అగ్నిహోత్రం, శంఖునాదంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి చిత్రపటానికి పూజలు చేశారు. నాలుగు కుండల్లో పెరుగు నింపి సంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికారు. కాగా, ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, లోకనాథం, టిటిడి బోర్డు మాజీ సభ్యులు శివకుమార్, దేశీయ వ్యవసాయ పరిశోధకులు విజయరామ్, చిరుధాన్యాల ఆహార నిపుణులు రాంబాబు, గోశాల వెటర్నరీ డాక్టర్ డా.నాగరాజు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.