కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు. ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజైన శుక్రవారం ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు హోమాలు, ఉదయం 7.30 గంటలకు మహా పూర్ణాహూతి నిర్వహించారు. ఉదయం 8 నుండి 8.20 గంటల మధ్య కన్యాలగ్నంలో శ్రీ వేణుగోపాల స్వామి, పరివార దేవతలకు కుంభార్చన, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 10.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్య, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.