న్యుమోనియా నుంచి చిన్న పిల్లలను రక్షించడానికి న్యుమోకోకల్ కాంజుగేట్ టీకా (PCV) యూనిర్సల్ ఇమ్యునైజెషన్ ప్రోగ్రాం కు సంబందించి చిన్నారులకు వేసేందుకు 7 వేల డోస్ లు సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యాధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత మండలాలలో మలేరియా, డెంగ్యూ కేసుల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 27 మండలాలలో మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా ప్రాంతాలలో యాంటీ మలేరియా ఆపరేషన్ లను నిర్వహించడం, ఫాగింగ్ చేయడం, మురికి నీరు, నిల్వనీరు లేకుండా ఆయా పంచాయితీలలో పారిశుధ్యాన్ని ప్రత్యేకంగా చేయాలన్నారు. ఆయా ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయడం తో పాటు మాపింగ్ చేయాలన్నారు. ఇందుకు సంబందించి మలేరియా సిబ్బందితో పాటు సర్పంచ్ లు ప్రత్యేక శ్రద్ద కనపర్చాలన్నారు. డాక్టర్లు సంబందిత సచివాలాయలకు తనిఖీలు చేయాలని ఫీవర్ కేసులు గుర్తిస్తే సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయడం టెస్ట్ చేసిన రిపోర్టులను డి. ఎం. హెచ్ .ఓ కార్యాలయానికి పంపించి ట్రీట్ మెంట్ మొదలు పెట్టాలన్నారు. ఏ వ్యక్తి కూడా మలేరియా డెంగ్యూ జ్వరాలకు చనిపోకుండా మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంచడం, ప్రసార మాధ్యమాల ద్వారా విసృత ప్రచారం చేయాలన్నారు. జ్వరాల సీజన్ మొదలవక ముందే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ, ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరైయారు.