ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ దేవస్థానాల్లో జిసిసి ఉత్పత్తులను వినియోగించడానికి ఈఓలు ముందుకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జిసిసి) చైర్మన్ డా.శోభా స్వాతిరాణి కోరారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఆమె కుటుంబ సమేతంగా సందర్శించి అక్కడ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో పెద్దిరాజుని కలిసి జిసిసి ఉత్పత్తులైన పసుపు , కుంకుమ , తేనే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేవాలయంలో స్వామివారికి జిసిసి ఉత్పత్తులు వాడటం ద్వారా గిరిజన రైతులకు ప్రోత్సాహం లభించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అభివ్రుద్ధి చెందుతాయన్నారు. ఉత్పత్తులను వినియోగించడానికి సహకరించవలసింది ఈఓను కోరారు. అంతేకాకుండా దేవస్థానంలో జిసిసి స్టాల్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా షాపును కేటాయించాలని కూడా ఆమె కోరారు. జిసిసి చైర్మన్ అభ్యర్ధనపై ఈఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.