మెటర్నిటీ లీవులు అమలు చేయాలని కోరుతూ కేజిహెచ్ కోవిడ్`19 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జెఎసి కార్యదర్శి పి.మణి మీడియాతో మాట్లాడారు. కెజిహెచ్లో కోవిడ్ కాలంలో గత ఏడాది139 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జిఓ.నెం.241 ద్వారా తమను ప్రభుత్వం నియమించిందన్నారు. నియామక పత్రాల్లో మెటర్నిటీ లీవులు, సెలవులు వర్తిస్తాయని స్పష్టంచేసిందన్నారు. అయితే ఇటీవల వీరి కాంట్రాక్ట్ ముగియడం, కోవిడ్ నేపధ్యంలో మరో 6నెలలు కాంట్రాక్ట్ను పొడిగించిన తరుణంలో తమకు మెటర్నిటీ లీవులు, ఇతర శెలవులు, అమలు కావని కెజిహెచ్ సూపరిన్టెండెంట్ చెప్పారని వారో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్లో పని చేసిన వారికి 6నెలల మెటర్నిటీ లీవులు ఇవ్వాలని స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలున్నా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెటర్నటీ శెలవులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి ప్రధాన కార్యదర్శి పి.మణి, కాంట్రాక్ట్ స్టాప్ చెల్లాయమ్మ, చంద్రకళ, మానస, మాధురి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.