విశాఖవనరులతోనే పర్యాటకాభివృద్ది.. మంత్రి అవంతి


Ens Balu
3
విఎంఆర్డీఏ
2020-09-09 19:45:52

విశాఖ నగర పరిధిలోని ప్రకృతి వనరులను  ఉపయోగించు కుంటూ ప్రణాళికాయుతంగా  పర్యాటకాభివృద్ది చేపట్టాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివా సరావు అధికారులను ఆదేశించారు.  బుధవారం విఎమ్ఆర్ డిఎ సమావేశ మందిరంలో పర్యాటకాభివృద్ధిపై  విఎమ్ ఆర్ డిఎ, పర్యాటకశాఖ, పురావస్తుశాఖ లతో ఆయన సమీక్షించారు.  ముఖ్యంగా ఆదాయ వనరులు పెంపొందించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.  పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్దతి ద్వారా  ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు.  పర్యాటక రంగ అభివృద్ధితో పాటు ఆదాయం సమకూరుతుందన్నారు.  విఎమ్ఆర్ డిఏ పరిధిలోని స్లాట్ లను వేలం ద్వారా విక్రయించడం,  ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో  వాణిజ్య సముదాయాలను నిర్మించడం చేయాలన్నారు.  విఎమ్ఆర్ డిఎ, అటవీశాఖ, పురావస్తుశాఖ, జివియంసి, పర్యాటక శాఖల సమన్వయంతో సింగిల్ విండో పద్దతిని ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.   పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  వుడా పరిధిలో చెపడుతున్న పథకాలు, వాటి పురోగతిని, భవిష్యత్ ప్రణాలికను గూర్చి  కమిషనర్ పి.కోటేశ్వరరావు వివరించారు.  మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం, ఎన్ఎడి  ఫ్లై వోవర్, కైలాసగిరి అభివృద్ధి పనులు, బహుళ అంతస్తుల కార్ పార్కింగ్,  కైలాసగిరిపై  మ్యూజియం కాంప్లెక్స్, కాపులుప్పాడలో నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం కమ్ రిసెర్చి సెంటర్, రామకృష్ణా బీచ్ లో  అండర్ గ్రౌండ్ పాత్ వే, ఫుట్ కోర్టు మొదలైన వాటిని గూర్చి వివరించారు. డిశంబరు  నెలాఖరుకు  ఎన్.ఎ.డి ఫై వోవర్ పూర్తవుతుందని ప్రస్తుతం ఎయిర్ పోర్టు- ఎన్.ఎస్.టిఎల్ రోడ్డు పూర్తియిందని, త్వరలోనే గోపాలపట్నం-ఎన్.ఎస్.టిఎల్ రోడ్లు పూర్తవుతుందని,  తరువాత మర్రిపాలెం-గోపాలపట్నం,  ఎన్.ఎస్.టి.ఎల్.- ఎయిర్ పోర్టు రోడ్లు పూర్తవుతాయని వెల్లడించారు.   పర్యాటక శాఖ ద్వారా  చేపడుతున్న పథకాలను గూర్చి  ప్రాంతీయ సంచాలకులు రాంప్రసాద్ వివరిస్తూ నగరంలో టూరిజం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. యారాడ, తంతడి, ముత్యాలమ్మపాలెం, రేవుపోలవరం, పూడిమడక బీచ్ లతో పాటు కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధ చేయన్నట్లు తెలిపారు.   పురావస్తు శాఖ ద్వారా బావికొండ, తొట్లకొండ, పావురాల కొండల అభివృద్దిని గూర్చి శిల్పారావం అభివృద్ధిని గూర్చి ఆయా శాఖల అధికారులు విశదీకరించారు. ఈ  సమావేశంలో  విఎమ్ఆర్ డిఎ అడిషనల్ కమిషనర్ మనజీర్ జిలాని,  గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి  శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్, టి.ఐ.ఓ. పూర్ణిమాదేవి, పురావస్తుశాఖ,  విఎమ్ ఆర్ డిఎ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.