కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు పెంచుకోవడం, ఒకరికొకరు ఆత్మీయతను పంచుకోవడం ద్వారా, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సూచించారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జూమ్ వెబ్నార్లో, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి కుటుంబ వ్యవస్థలో, తల్లితండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లలు, యువత తాము ఒంటరి తనానినికి లోనై, ఒత్తిడికి గురి అయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పిల్లల్లో, యువతీయువకుల్లో ఒంటరితనాన్ని పారద్రోలే చర్యలు చేపట్టాలని అన్నారు. పిల్లల మనసును చదువుతో పాటు, ఆటలు, వ్యాయామం, కళలు తదితర అంశాలపై మల్లింపజేయాలని సూచించారు. అహ్లాదకరమైన కుటుంబ వాతావరణన్ని కల్పించాలని కోరారు. నేటి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా మారాలని, మానసికంగా ప్రశాంతంగా, అలజడి లేకుండా ఉన్నపుడు మాత్రమే ఒత్తిడిని అధిగమించవచ్చును కలెక్టర్ స్పష్టం చేశారు. అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్(ఆసరా) జె. వెంకటరావు మాట్లాడుతూ, ఉద్యోగ రీత్యా అందరికి పని ఒత్తిడి ఉన్నపటీకి, దానికీ కుటుంబానికి సమన్యాయం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవడం తోబాటు, మనం చేసే పనిని ఇష్టంగా చేయడం వలన పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, జిల్లా యువజన సమన్వయాధికారి జి.విక్రమాదిత్య మాట్లాడారు. ఆత్మహత్యల నివారణ మరియు యువ సంకల్ప బలం గురించి వివరించారు. వెబ్ నార్లో భాగంగా, ఆత్మహత్య నివారణ మరియు మానసిక సంసిద్దత అనే అంశాల పై, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ జాగరపు ప్రసంగించారు. ఆయుష్ వైద్యులు డాక్టర్ స్వప్న చైతన్య మాట్లాడుతూ, యోగ చికిత్స ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించే విధానాలను వివరించారు.