టిటిడిలో కొత్త ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకారం..


Ens Balu
4
Tirumala
2021-09-17 12:14:59

యానాంకు చెందిన  మల్లాడి కృష్ణారావు, తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే  ఎపి.నందకుమార్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శుక్రవారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి జెఈవో సదాభార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు. అనంతరం ఆలయం వెలుపల మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డులో తనకు మొదటిసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి, టిటిడి చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. గతంలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవ చేశానని, అయితే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తునిగా స్వామివారి భక్తులకు సేవ చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆలయం వెలుపల  ఎపి.నందకుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో తనకు ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం వచ్చిందని, సాధారణ సేవకునిగా పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.