కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీ కి రూ 6 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. టీటీడీ
ఈఈ శివరామ కృష్ణ, ఎఈవో మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి, కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.