మాట నిలబెట్టుకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి..


Ens Balu
3
Kurupam
2021-09-24 09:51:20

కురుపాం నియోజకవర్గంలోని నాగావళి నదిపై కొమరాడ మండలంలో నిర్మిస్తున్న పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి పుష్ప శ్రీవాణి చొరవతో ప్రభుత్వం రూ.14 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న వంతెనను గత ఏడాదిలో అధికారులతో కలిసి పుష్ప శ్రీవాణి సందర్శించి నిలిచిపోయిన పనులను పరిశీలించిన విషయం  తెలిసిందే. కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉన్నాయని, మరో 9 పంచాయతీలు మరోవైపున ఉన్నాయి. అయితే నాగావళి  నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు నియోజకవర్గకేంద్రమైన కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు పార్వతీపురం మీదుగా చుట్టుతిరిగి రావడానికి 50-60 కిలోమీటర్ల దాకా వెళ్లాల్సివస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు గ్రామాలమధ్యన నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కొమరాడ మండలానికి చెందిన అన్ని పంచాయితీల ప్రజలు ఆరు, ఏడు కిలోమీటర్ల ప్రయాణంతోనే అటు కొమరాడకు, ఇటు కురుపాంకు చేరుకుంటారని, ఎన్నోఏళ్లుగా ఈ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తీరి పోతాయని కొమరాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత ప్రాధాన్యత కలిగిన వంతెన నిర్మాణాన్ని గత టిడిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, మంజూరు చేసిన నిధులు కూడా రాకపోవడంతో ఈ వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ కారణంగా నిర్మాణంలో జరిగిన ఆలస్యం తో రూ. 10 కోట్ల అంచనాతో మొదలైన ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ. 14 కోట్లకు చేరిందని, దీనికి అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగానే అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అయితే నిధుల మంజూరులో జాప్యం కారణంగా వంతెన నిర్మాణంలో ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేసిన పుష్ప శ్రీవాణి ఎక్కువగా గిరిజన ప్రాంతాల ప్రజలకు మేలుచేసే ఈ వంతెన నిర్మాణానికి ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తామని, రాబోయే నోడల్ ఏజెన్సీ సమావేశంలోనే దీనికి అనుమతిని తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారంగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఈ వంతెన నిర్మాణానికి రూ.7 కోట్లను కేటాయించారు. ఇది కాకుండా పంచాయితీ రాజ్ శాఖ ద్వారా మరో రూ.7 కోట్లను కూడా కలుపుకొని మొత్తం రూ.14 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్.500 ను జారీ చేసింది. ఈ నిధుల మంజూరుతో పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. దీంతో నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం కొమరాడ ప్రజలు కంటున్న కల కూడా నెరవేరనుంది.