విజయనగరం జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేనందున విద్యార్ధులకు క్రీడలకు అవకాశం ఉండడం లేదని, అటువంటి పాఠశాలలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం కల్పించాలని సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి డా. మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్ లో ప్రస్తుతం జరుగుతున్న క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు, ఉపాధి హామీ నిధులతో సర్వ శిక్షా అభియాన్ ద్వారా చేపట్టిన క్రీడా క్షేత్రాల పురోగతి పై ఆయా ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు యూజర్ చార్జి లను చెల్లించి వాటి క్రీడా మైదానాలను వినియోగించుకునేలా అన్ని పాఠశాలలకు ఒక సర్కులర్ పంపాలని జిల్లా విద్యా శాఖాధికారి సత్యసుధ కు ఆదేశించారు. అదే విధంగా కళాశాలల వారు కూడా వినియోగించుకునేలా చూడాలని ఆర్.ఐ.ఓ , డి.వి.ఈ.ఓ లకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిపార్టుమెంటల ఫెస్ట్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సెట్విజ్ సి.ఈ.ఓ విజయ్ కుమార్ కు సూచించారు. ఈ సమావేశం లో హౌసింగ్ జె.సి మయూరి అశోక్, చీఫ్ కోచ్ వెంకటేశ్వర రావు, ఈ లు, డి ఈ లు శాప్ సిబ్బంది హాజరైనారు.