ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-10-06 12:37:52

విశాఖ జిల్లాలో ఎస్.సి, ఎస్.టి కేసులకు సంబందించి పెండింగ్  లేకుండా పరిశీలించి  వెంటనే  పరిష్కారం  చేయాలని  జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ మరియు మానటరింగ్ కమిటి చైర్మెన్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  బుధవారం  స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  డి.వి.ఎం .సి., ఎస్.సి., ఎస్.టి ఎట్రాసిటి  కేసులపై సమావేశాన్ని నిర్వహించారు. 
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో కులదృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా  పరిశీలించి పెండింగ్ లేకుండా  జారీ చేయాలని ఆదేశించారు. సుదీర్ఝంగా  అపరిష్కృతం కాని కేసులకు సంబందించి  తదుపరి నిర్వహించే సమావేశం లోపల పరిష్కారం చేయాలని  వాటికి సంబందించి ఎటువంటి చర్యలు చేపట్టినది తగు నివేదికను అందజేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  ఎస్.సి., ఎస్.టి ఎట్రాసిటి కేసులకు సంబందించి భాదితులకు సత్వర న్యాయం  చేసే ఉద్దేశ్యంతో    ఆదేశాలు జారీ చేసారన్నారు. భాదిత కేసులకు  పరిహారాన్నిత్వరితగతిన  అందజేయాలన్నారు.  అక్టోబరు నాలుగవ శనివారం డివిజన్  స్థాయి  విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటి సమావేశాన్ని  నిర్వహించి సంబందిత ప్రజా ప్రతినిధులను  ఆహ్వనించాలన్నారు.  జిల్లా కలెక్టర్ స్థాయిలో తాము కూడా పర్యటిస్తామన్నారు. 
అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బి.సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం  పాటు పడుతున్నారని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సబ్ డివిజన్ స్థాయి ఎస్.సి., ఎస్.టి మోనటరింగ్ సమావేశాలను ఏర్పాటు చేసినపుడు ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి నెల ‘సివిల్ రైట్స్ డే’ న దళిత గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను  తెలుసుకొని పరిష్కరించాలన్నారు. 
పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2013 నుండి నేటి వరకు పెండింగ్ లో ఉన్న ఎస్.సి., ఎస్.టి  ఎట్రాసిటి కేసులను నిర్దిష్టమైన కాల వ్యవధిలో పరిష్కరించాల్సిందిగా కోరారు.  అదే విదంగా ప్రభుత్వం అందజెస్తున్న జగనన్నతోడు , చేయూత పథకాలకు భగత ఉపతెగ గిరిజన సామాజిక వర్గంలో లేకపోవడం చేత  వారు ఆర్ధిక సహాయాన్ని అందుకోలేక పోతున్నారని, తగు న్యాయం చేయాల్సిందిగా  కలెక్టర్ కు సూచించారు. 
డి.వి.ఎం.సి కమిటి సభ్యులు పి.మల్లేశ్వరరావు, జోసఫ్ మాట్లాడుతూ  ఎస్.సి కార్పోరేషన్ కు సంబందించి నిర్వహిస్తున్న  షాపింగ్ కాంప్లెక్స్ లో 40 సంవత్సరాలు నుండి ఒక్కరికే తక్కువ అద్దేకు  ఇచ్చారని, ఎస్.సి లబ్దిదారులకు చెందిన షాపులను వేరే కులాల వారు అద్దెకు నడుపుతున్నారని, తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు. ఎస్.సి., ఎస్.టి బాధితులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎటువంటి స్పందన లేకుండా కేసులను కట్టడం లేదని కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని తెలిపారు. పెందుర్తి మండలం నరవలో హౌసింగ్ స్కీమ్ కు సంబందించి స్థలాలను   అగ్ర కులాస్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ లను కట్టుకొన్నారని తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు.  
సాంఘీక సంక్షేమ శాఖ జెడి  రమణమూర్తి మాట్లాడుతూ  జిల్లాలో  (UI) అండర్ ఇన్విస్టి గేషన్ కేసులు  పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో మొత్తం 219 కేసులు  పెండింగ్ కాగా 50 కేసులు పరిష్కారమైయాయని మిగలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు.  PT కేసులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 718 పెండింగ్ కాగా  ఒకటి మాత్రమే పరిష్కారమైనదని మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు. UI కేసులు   146, PT కేసులు 549 పట్టణ సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్నాయన్నారు.  అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు , చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో UI  కేసులు 78,  PT కేసులు 209 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  2011 సంవత్సరం నుండి నేటి వరకు లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలించి సత్వర పరిష్కారం చేయాలన్నారు. 
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు  జి.మాధవి, ఎస్.పి బి.కృష్ణారావు,  జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల రెడ్డి, అరుణ్ బాబు, పి.ఓ ఐ.టి.డి.ఎ., గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అబిషేక్, విశాఖపట్నం, నర్సీపట్నం ఆర్ డి ఓ లు పెంచల కిశోర్, ఆర్.గోవిందరావు, జిల్లా మరియు  పోలీస్ అధికారులు హాజరైయ్యారు.