రాష్ట్రప్రజలపై దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలి..


Ens Balu
17
Vijayawada
2021-10-09 09:34:34

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు శనివారం ఇంద్రకీలాద్రిపై జగన్మాతగా శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకుంటున్నట్లు రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీగాయత్రిదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని శనివారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ ఎటువంటి శుభకార్యమైన లోకమాత గాయత్రిదేవి ఉపాసనతోనే ప్రారంభిస్తారన్నారు. గాయత్రిమంత్రం సర్వ శుబాలను కల్గిస్తుందన్నారు. అటువంటి మహన్మితమైన గాయత్రిదేవిని భక్తులు దర్శించుకుంటే పుణ్యఫలాలు వారికి లభిస్తాయన్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు కూడా 30 నుండి 40 నిమిషాల్లో అమ్మవారి దర్శనం కలుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా రోజుకు 10 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నామన్నారు. అయితే ఆన్‌లైన్‌లో టిక్కట్లు తీసుకోలేక నేరుగా దర్శనానికి వచ్చిన వారికి కూడా దుర్గమ్మ దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం, సోమవారం మూలా నక్షత్రం రోజులలో వచ్చే భక్తుల రద్దిని దుష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్నప్రసాదవితరణ సక్రమంగా జరుగుతుందన్నారు. ప్రతి రోజు సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని లోటుపాట్లను సరిదిద్దుతున్నామన్నారు. ఇందుకు మీడియా కూడా సహకరిస్తుందని ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
సిఫార్సు