యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఆవిష్కర్తలుగా నిలపే ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న రీజినల్ స్కిల్ కాంపిటీషన్కు విశాఖ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన యువత ఈ పోటీలలో భాగమవుతున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణపై ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్, హెచ్పిసిఎల్ జిఎం(హెచ్ఆర్) కె.నగేష్ ఆదివారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమై చర్చించారు. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం విశాఖ నగరంలో నిర్వహించడం ఎంతో మంచి పరిణామమన్నారు.వర్సిటీ సహకారం, భాగస్వామ్యం దీనిలో అవసరమని నగేష్ కోరారు.52 ట్రేడ్లలో జరిగే పోటీలలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి 1200 మంది ఈ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని, నవంబరు 30 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందని వివరించారు.