అందుకే ఆ జిల్లా కలెక్టర్ అందరికీ ఆదర్శం..
Ens Balu
7
Vepada
2021-10-20 13:24:28
రథసారధి బాగుంటే రధం సాఫీగా ప్రయాణం చక్కాగా సాగుతుంది.. అదే జిల్లా రథసారధి మనసు పెట్టి పనిచేస్తే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయి..ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరతాయి..అలా జరగాలంటే ఐఏఎస్ లు జిల్లా కార్యాలయాలు వీడి క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. అపుడే ప్రజలు పడే బాధలు తెలుస్తాయి.. అలా ప్రజల బాధలు తెలుసుకోవడానికి విజయనగం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పల్లెబాట పట్టారు. ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తప్పా మిగిలిన రోజులన్నీ రోజుకో గ్రామం చొప్పున జిల్లా మొత్తం చుట్టేస్తూ..ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నారు.. తమ పర్యటనలో చూసిన, తెలుసుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ ఎందరో అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. అంతేకాదు విధినిర్వహణలో మండల, డివిజన్ స్థాయి అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏకరవు పెడుతున్నారు. ఒక జిల్లా కలెక్టర్ రోజుకో గ్రామాన్ని తిరగడం చూస్తున్న విజయనగరం జిల్లా అధికారులకు కంటిమీద కునుకు ఉంటం లేదు. సమస్యలు పరిష్కారం అయిపోతాయని కాదు..ఎక్కడ తమ లొసులుగులు, నిర్లక్ష్యం బయటపడుతుందోనని.. ఈ క్రమంలోనే బుధవారం జిల్లా కలెక్టర్ వేపాడ మండలంలో తన పర్యటన చేపట్టారు.. జాకేరులో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. వాటి పనితీరు, ప్రజలకు ఆయా కార్యాలయాల ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలపై ఆరా తీశారు. ముందుగా గ్రామ సచివాలయం తనిఖీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులందరికీ పథకాలు అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. సచివాలయానికి వచ్చిన వినతులు ఏ మేరకు పరిష్కారం అవుతున్నదీ తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరువుతున్నదీ లేనిదీ పరిశీలించారు. సచివాలయంలోని పలు రిజిష్టర్లను తనిఖీ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమంపై అధికంగా దృష్టి సారించి ఆయా పథకాలు ఏవిధంగా అర్హులకు అందుతున్నదీ తెలుసుకోవాలన్నారు. అర్హులైన వారు ఇంకా మిగిలి వుంటే వారికి పథకాలు అందించే ప్రయత్నం చేయాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై కూడా కలెక్టర్ ఆరా తీశారు. గ్రామంలో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నదీ ఆరోగ్య సహాయకులను అడిగి తెలుసుకున్నారు. శతశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రైతుభరోసా కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామ వ్యవసాయ సహాయకుడితో మాట్లాడి ఇ-పంట నమోదు, ఇటీవల వర్షాలకు పంటనష్టం వివరాల నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్, ఎంపిటిసి తదితరులు కూడా పర్యటనలో పాల్గొన్నారు.