శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం..


Ens Balu
5
Tirupati
2021-10-20 13:58:43

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా  ఉద‌యం సుప్రభాత సేవ‌తో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం, అన్నలింగ అలంకరణ చేపట్టారు. అంతకుముందు శుద్ధోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.  అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవ‌ట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం అన్నలింగ దర్శనం అనంతరం, అన్నలింగ ఉద్వాసన చేశారు. స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.