ఎంతటి వారైనా.. సోషల్ మీడియా కాలంలో అందరూ ఆన్ లైన్ పేపర్ బాయ్ లే.!


Ens Balu
71
visakhapatnam
2025-06-03 02:29:48

అగ్గిపిల్ల.. సబ్బుబిల్ల.. ఆడపిల్ల.. కదేదీ కవితకు అనర్హం అన్నాడొక సినీ కవి.. కవితలు, కొటేషన్లు మాట దేవుడెరిగితే.. కొమ్ములు తిరిగిన జర్నలిస్టులైనా, అధికార పార్టీలో మంత్రులైనా, ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న అధికారులైనా, చోటా మోటా నాయకులైనా కారెవరూ పేపర్ బాయ్(దినపత్రికలైతే), కేబుల్ ఆపరేటర్ (టీవి ఛానల్ అయితే యూట్యూబ్ లింక్, వీడియో క్లిప్పింగ్)జీతంలేని ఉద్యోగానికి అనర్హం అంటోంది సోషల్ మీడియా.. ఎవరైనా కానీ చివరకు అర్ధరాత్రైతే పేపర్ బాయ్ అవతారం ఎత్తాల్సిందే. ఒకప్పుడు దినపత్రికలంటే అచ్చు వేసిన తరువాత పంపిణీ కుర్రాళ్లకు పార్శిళ్లు ప్రింటింగ్ యూనిట్ ల నుంచి వెళితే గానీ పేపర్ చదివే పరిస్థితి ఉండేది కాదు. సాంకేతిక విప్లవం పుణ్యమాని సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో దినపత్రికలు ముద్రణ కాకమునుపే ప్రజల అరచేతిల్లోకి చేరిపోతున్నాయి. ఏదైన ఒక మంచి విషయమో, అవినీతి అంశమో, సంస్థల ప్రారంభోత్సవాలో, ప్రముఖుల సమావేశాలో, అధికారుల ముఖాముఖీ కార్యక్రమాలు పత్రికల్లో అచ్చువేస్తే.. సదరు పత్రికలు తెల్లవారేసరికి ఇంటికి వచ్చే వరకూ ఏ విషయమూ ఎవరికీ తెలిసేది కాదు. 

నేడు సాంకేతిక విప్లవం రోజు రోజుకీ పెరుగుతున్నవేళ జర్నలిస్టులతో పాటు ప్రతీ ఒక్కరూ ఆన్ లైన్ పేపర్ బాయ్ అవతారం ఎత్తాల్సిన పరిస్తితి నెలకొంది. అందులోనూ పోటీ బాగా పెరిగిపోవడంతో ఉదయంమంతా టిప్పుటాపు గా  తయారై వార్తలు జర్నలిస్టులు అర్ధరాత్రి అయ్యాక ఆన్ లైన్ పేపర్ సప్లయ్  చేయడం మొదలు పెడితే.. ఆ వార్తలను సోషల్ మీడియాలో చూసుకున్నవారంతా వాటిని మరో పదిమందికి తెలియజేయడానికి వాళ్లూ ఆన్ లైన్ పేపర్ బాయ్ అవతారం ఎత్తాల్సి వస్తున్నది. దానికి వాట్సప్, ఫేస్ బుక్, యూట్యూబ్, టెలీగ్రామ్ అనే సామాజిక మాధ్యమాలు ఆన్ లైన్ లో మధ్యవర్తిలుగా మారడంతో  వాటి సహాయంతోనే నిద్రకు ఉపక్రమించే ముందే పేపర్ బాయ్ ఉద్యోగం చేసిన తరువాత మాత్రమే పడుకునే పరిస్థితి. రాత్రులు జర్నలిస్టులు పేపర్ బాయ్ అవతారం ఎత్తితే.. వాటిని తెల్లవారు జామున వాట్సప్ ప్రపంచంలో చూసుకున్నవారంతా మళ్లీ వాళ్లూ పేపర్ బాయ్ అవతారంలోకి మారుతున్నారు. 

ఎందుకంటే వారి కోసం వచ్చిన వార్తలు అది మంచైనా, చెడైనా, సమాజానికి కి పనికొచ్చే అంశమైనా.. ఇలా ఏదైనా నలుగురికీ పంచుకోవడానికైనా ప్రతీ ఒక్కరినీ సోషల్ మీడియా పేపర్ బాయ్ గా మార్చేసిందంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు దినపత్రికలు అచ్చుచేయాలంటే పత్రికా కార్యాలయంలో ప్రింటింగ్ యూనిట్ లో అనే దశలు దాటి ( పేజి డిజైనింగ్, ప్రూఫ్ రీడింగ్, ఫోటో కరెక్షన్, స్టెన్సిల్  మోడింగ్, ప్లేట్ మేకింగ్, సీటీపీ, ప్రింటింగ్) అన్ని దశలు దాటుకొని అచ్చువరకూ వెళ్లేవి. కంప్యూటర్ కాలం.. ఇంటర్నెట్ వీధి వీధికి వచ్చిన రోజులేమో.. అదికాస్త మరింత సులవైపోయింది.  అందులోనూ పీడిఎఫ్(పార్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్) విధానం ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చాయో.. కొమ్ములు తిరిగిన వారినైనా పేపర్ బాయ్ లు గామర్చేయ గల సత్తా సోషల్ మీడియాకి వచ్చేసింది. ఒకప్పడు బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా వాటిని దినపత్రికల్లో వార్తలుగా చూసిన తరువాతో, రాత్రి 9 గంటలకు టీవీల్లో చూస్తేనే తెలిసేది. కానీ ఇంటర్నెట్ విపరీతంగా అభివృద్ధి చెందడంతో అరచేతిలోనే విశ్వవార్తల సమాహారం అంతా వచ్చి పడుతున్నది. 

దిన పత్రికలను కొనుక్కొనుని చదవడం మానేసి. అరచేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ ఆధారంగాగా ప్రతీ ఒక్కరూ చూసేసి.. మళ్లీ వాళ్లే పేపర్ బాయ్ అవతారం ఎత్తేసి..మరీ అందరికీ షేర్ చేసేస్తున్నారు.. చదివేస్తున్నారు.. తొలుత జర్నలిస్టులు ఉదయం రిపోర్టర్ అయి, రాత్రికి పేపర్ బాయ్ గా మారితే.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ వార్తలును సెల్ ఫోన్లలో  చూసిన వాళ్లందరినీ(పేపర్ అయితే క్లిప్పింగ్, టీవీ ఛానల్ అయితే యూట్యూబ్ లింక్, అదీ కాదంటే వీడియో క్లప్పింగ్) కూడా సోషల్ మీడియా పేపర్ బాయ్ గా మార్చేస్తున్నది. అంటే చూసిన వాడు ఊరకనే అలా ఉండి పోకుండా.. ఆ ఇద్దరికే(ఒకటి అడిగిన వాడికి, రెండూ అడగని వాడికి) షేర్ చేయడం మొదలుపెడుతున్నాడు. ఇలా దినపత్రికలు ఇంటి వాకిటకు అచ్చు అయి పేపర్ రూపంలో వెళ్లక ముందే.. సామాజిక మాద్యమాల్లో ప్రపంచం చుట్టి వచ్చేస్తున్నాయి. దానికి ప్రతీఒక్కరూ పేపర్ బాయ్ గా మారితే ఇది సాధ్యపడుతున్నది. అందులోనూ ఇపుడు సామాన్యులు సైతం ఆండ్రాయిడ్ ఫోన్, సంపన్నులు ఆపిల్ ఫోన్ లు వాడుతున్నారేమో జీతం లేని పేపర్ బాయ్ ఉద్యోగం ప్రతీ ఒక్కరూ చేయాల్సి వస్తున్నది.

 వినడానికి వింతగా ఉన్నా.. ఈ స్టోరీ మీరు చదువుతున్న సమయంలో కూడా మీకు అనిపిస్తుంటుంది. నిజమే వార్త రాసిన జర్నలిస్టూ పేపర్ బాయ్ గా మారి.. వాటిని మనకి వాట్సప్ లో షేర్ చేస్తే.. దానిని చదివిన మనం కూడా మరో నలుగురికి షేర్ చేయడానికి పేపర్ బాయ్ లుగా మారుతున్నామని. కలికాలం  కలికాలం అంటే ఏమో అనుకున్నాం గానీ..సోషల్ మీడియా ప్రతీ ఒక్కరినీ పేప్ బాయ్, కేబుల్ టీవీ ఆపరేటర్లుగా మార్చేస్తుందటే నిజమని సోషల్ మీడియా వస్తేగానీ తెలియలేదు. నిజమే కదా మరి సాంకేతిక విప్లం తెచ్చిన అభివృద్ధి ఎంతటి వాడినైనా ఆన్ లైన్ లో పేపర్ బాయ్ ని చేసిందనడాకి సోషల్ మీడియా కంటే నిదర్శనం ఇంకేమున్నది. ఒక్కోసారి ప్రతీ అంశమూ ఒక స్టోరీ అవుతుందని.. ఆలోచన ఉంటే దానిని వార్త రూపంలోనో, కథ రూపంలో మలచగల సత్తా ఒక్క జర్నలిస్టుకి మాత్రమే ఉంటుందని నమ్మి తీరాలి.. ఆపై మళ్లీ ఎలాగూ...జీతంలేని ఆన్ లైప్ పేపర్ బాయ్ ఉద్యోగం వాట్సప్ లోకి అవి వచ్చి చేరినత తరువాత అందరూ చేయకతప్పదు కదా..అవునా..?!