స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడాలి ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళ నేడు అంతరిక్షంలోకి దూసుకుపోయేలా ఎదుగుతున్నా.. వివక్షత ,వేధింపులు తప్పడం లేదని ప్రముఖ న్యాయవాది కె. నాగజ్యోతి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తరతరాలుగా మహిళలు చేస్తున్న పోరాట ఫలితంగా ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు అని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అదేవిధంగా అన్యాయం జరిగితే ఎదిరించేందుకు చట్టాలు అండగా ఉన్నాయన్నారు. మహిళను కించపరిచినా , అవమానించినా , గౌరవ భంగం కలిగించినా చట్టపరంగా శిక్ష తప్పదని నాగజ్యోతి తెలిపారు. వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను ఎంపిక చేసి ఉత్తమ సేవ పురస్కారాలను అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది నాగజ్యోతి, విలేఖరి నందిని, ఎన్ సి సిఅధికారి, ఉపాధ్యాయురాలు కె. అనిత, లెక్చరర్ జి .పావని, మండల మహిళ సమైక్య కాకినాడ రూరల్ అకౌంటెంట్ ప్రగడ దేవిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, సాహిత్యవేత్త డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, జానకి రామ, రవిశంకర్ పట్నాయక్ ,రేలంగి బాపిరాజు, పీవీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.