గాజువాకకు చెందిన నమ్మి బాబూరావుకు అంతర్జాతీయ పురస్కారం వరించింది. ఆర్యభట్ట కల్చరల్ సంస్థ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 16 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందినవారిని గుర్తించి సత్కరించింది. ఇందులో భాగంగా గాజువాక పెదగంట్యాడ మండలం, సీతానగరం గ్రామానికి చెందిన నమ్మి బాబూరావును మల్టీ టాలెంటెడ్ విభాగంలో గుర్తించి అవార్డును ప్రధానం చేశారు. బాబూరావు బాడీ బిల్డింగ్, కుంగ్పూ, కరాటే, యోగాలో 1996 నుంచి నిర్విరామంగా శ్రమిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చేస్తున్న కృషికి గాను ఆర్యభట్ట సంస్థ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. బెంగళూరులో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక లా కమిషన్ చైర్మన్ డాక్టర్ అశోక్ బి.హించిగేరి, కర్ణాటక సాహిత్య పరిషత్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేష్ జోషి, ఆర్యభట్ట కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్.ఎల్.ఎన్.రావు, తెలుగు హీరో రాంకీ, కన్నడ డైరెక్టర్ క్రాంతిప్రసాద్, సాయిమారుతి కనస్ట్రక్షన్స్ ప్రసాద్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.