గ్రామ స్వరాజ్యమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం
Ens Balu
5
Munchangiputtu
2022-04-24 14:05:58
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా జగనన్న ప్రభుత్వం పయనిస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువు చేసే దిశగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దేశంలో గొప్ప వ్యవస్థనును సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించారని అన్నారు. ఆదివారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంచంగిపుట్టు మండలం సుజనకోటలో జరిగిన గ్రామ సభను ఆమె పాల్గొని మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే పల్లెలు అభివృద్ధి చెందాలన్న సిద్దాతాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం ప్రజా పాలనకు తెరతీశారని తెలిపారు. దివంగత రాజశేఖరరెడ్డి నిత్యం పల్లెలు, పల్లె ప్రజల గురించే ఆలోచిస్తూ ఉండేవారని ఆయన శ్వాస ఉన్నంతవరకూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే తపించారని సుభద్ర పేర్కొన్నారు. ఉత్తమ గ్రామీణ పాలన అందించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థను 1992లో భారత రాజ్యాంగం 73వ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఏడాది తర్వాత రాజ్యాంగంలో చేసిన ఈ సవరణ 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చిందని జెడ్పీ చైర్పర్సన్ పేర్కొన్నారు. తొలిసారిగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని సంబంధించి ప్రత్యేకంగా పండగలా చేసుకోవాలని మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారని ఆమె చెప్పారు. పంచాయతీలు, గ్రామాల అభివృద్ధిలో అటు కేంద్రప్రభుత్వమూ, ఇటు రాష్ట్రప్రభుత్వం సమాన ప్రాధానాలు ఇస్తున్నాయని చెప్పారు. గతంలో గ్రామాల్లో ఏ పని చేయాలన్న సరే రాజకీయ నాయకుల సిఫార్సు ఉంటే తప్ప ఏ పనీ అయ్యేదీ కాదని, ఏ ప్రభుత్వాలు వచ్చినా వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ప్రభుత్వ పథకాలు అందించేవారని ఆమె తెలిపారు. కానీ నేడు ఏ పథకం అందాలన్నా గ్రామంలో మీ ఇంటికొచ్చే గ్రామ వాలంటీర్కు చెబితే చాలు.. మీరు అర్హులైతే ఈ పథకం మీకు వర్తించే వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రజల వద్దకే పాలన అనే నినాదం తీసుకొచ్చారని, దానికి అప్పట్లో మంచి స్పందన లభించిందని, ఇప్పుడు దానికి మించిన పాలన గ్రామ సచివాలయాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుజన కోట సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు జగబందు, సాధన, తిరుపతి, ప్రసాద్, పద్మారెడ్డి, దామోదరం, సుజనకోట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.