భరతమాత ముద్దు బిడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆజాదీకా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని విడుదల చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. శనివారం విశాఖలోని విజెఎఫ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరున 125 రూపే వాణాన్ని విడుదల చేసారని అదే సంవత్సరం 1897లోనే జన్మించిన అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని అల్లూరి జయంతి జూలై 4లోగా విడుదల చేయాలని ఆయన కోరారు. 2006లో పార్లమెంట్ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఉండగా ఒక్క ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చే|శారని, నేటి వరకు అల్లూరి విగ్రహం ఏర్పాటుకు నోచుకోలేదన్నారు. కేంద్రానికి ఆర్ధిక ఇబ్బందులు ఉంటే మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు లోబడి ఎన్ని లక్షలు ఖర్చు అయినా తాము ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి 126వ జయంతోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించతల పెట్టినందులకు కేంద్ర ప్రభుత్వానికి పడాల కృతజ్ఞతలు తెలియచేసారు. జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అల్లూరి పుట్టింది విశాఖజిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం, వీర మరణం పొందింది కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం అని అల్లూరి 125వ జయంతోత్సవాలు ప్రారంభోత్సవ సభ భీమవరంలో కాకుండా అల్లూరి పోరాటం చేసిన క్రిష్ణదేవీపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా అల్లూరి చరిత్ర, ఆప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చేదని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లేందుకు క్రుషిచేస్తామన్నారు. జిల్లాల విభజనలో అల్లూరి సీతారామరాజు పేరుతో ఆయన నడయాడిన ప్రదేశాలను జిల్లాగా ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు. అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మాట్లాడుతూ, అల్లూరి చరత్రను పాఠశాల నుంచి యూనివర్శిటీ స్థాయి వరకూ పాఠ్యాంశాల్లో చేర్చడంతోపాటు, నాటి మద్రాసు ప్రావిన్సు ప్రభుత్వం నాటి గెజిట్లు కేంద్రం ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలన్నారు. అల్లూరి నడయాడిన, పోరాటం సాగించిన ప్రాంతాల అభివ్రుద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధి, పబ్లిక్ బ్యూరో ఇన్చార్జి యర్రా నాగేశ్వర్రావు మాట్లాడుతూ, అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా, రాష్ట్రమంతా ఒక ఉత్సవంలా చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా అల్లూరి విశిష్టత, చరిత్ర, బావి తరాలకు తెలిసే అవకాశం వుంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు సమధుల ప్రాంతంతోపాటు చుట్టు ప్రక్కల ప్రదేశాలను అభివ్రుద్ధి చేయాలన్నారు. సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామల మాట్లాడుతూ, అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటందొర, మల్లుదొర విగ్రహాలను అల్లూరి జిల్లాలోని అన్నిప్రాంతాల్లో పెట్టించాలన్నారు. కార్యవర్గ సభ్యులు ఎఎన్ఎస్.నారాయణ మాట్లాడుతూ, అల్లూరి చరిత్రను దేశవ్యాప్తంగా తెలిసేలా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవడంతోపాటు ఆయన వాస్తవ చరిత్ర తెలిసే విధంగా నాటి మద్రాసు ప్రావిన్సు ప్రభుత్వం నాటి ఆధారాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆదివాసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గడుతూరి రామ్ గోపాల్ మాట్లాడుతూ, అల్లూరి సెంట్రల్ పార్కును ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టిందని, అందులో అల్లూరి చరిత్రకుసంబంధించిన అన్ని అంశాలను పొందుపరచాలని, వాటి నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి యువజన సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.