సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆమదాలవలస రైల్వే స్టేషన్ (శ్రీకాకుళం రైల్ రోడ్) ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల ప్రజానీకానికి రైల్వే కనెక్టివిటీ గా ఉంటూ,సుదీర్ఘ కాలంగా సేవలు అందించింద న్నారు.చారిత్రక నేపథ్యం ఉన్న రైల్వే స్టేషన్ కు, అన్ని వసతులు ప్రాధాన్యత క్రమంలో సమకూర్చి,సర్వాంగ సుందరంగా రూపుదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.సోమవారం రైల్వే స్టేషన్ లో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను స్పీకర్ ప్రారంభించారు.స్టెయిన్లెస్ స్టీల్ తో ఏర్పాటు నిర్మించిన, ఈ బ్రిడ్జ్ దేశంలోనే రెండవది కావడం విశేషమన్నారు.త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి,వారధిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా కృషి చేసిన తూర్పు తీర రైల్వే డి ఆర్ ఎం అనూప్ కుమార్ శతపతి, సిబ్బంది ని స్పీకర్ అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో గల ఆమదాలవలస రైల్వేస్టేషన్ పురాతనమైందని, అటువంటి రైల్వేస్టేషనుకు మహర్ధశ పట్టేలా సంబంధిత శాఖ అధికారులు సేవలను విస్తరించేలా చొరవ చూపడం అభినందనీయమన్నారు.ఆమదాలవలస రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకుందని, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలనేది దశాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రజానీకం యొక్క ఆరాటం అన్నారు.20 గ్రామాల ప్రజానికం రైల్వే రోడ్డుకు ఇరువైపులా రాకపోకలను సాగిస్తున్నారన్నారు.శిథిలావస్థకు చేరుకున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్థానములో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి తాను ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న సమయంలో రైల్వే ఉన్నతాధికారులతో ప్రాతినిధ్యం చేశానన్నారు.ఇందుకోసం ప్రత్యక్ష పోరాటాలు కూడా తన ఆధ్వర్యంలో నిర్వహించిన విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు.ఈ ప్రాంత ప్రయాణికుల మెరుగైన సౌకర్యాల కోసం పోరాటానికి కూడా వెనుకాడని విషయాన్ని,అప్పటి సంఘటనలను స్పీకర్ గుర్తు చేశారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, స్పీకర్ గా తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం దీనికోసం పలు మార్లు రైల్వే ఉన్నత అధికారులతో ప్రాతినిధ్యం చేయడం జరిగిందన్నారు.
ఈ విషయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించిన సహకారం మరువలేనిదన్నారు. దీని నిర్మాణం కోసం సంవత్సరాల తరబడిగా, పట్టువదలని పోరాటం, ప్రాతినిధ్యం ల మూలంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సాకారం అయిందన్నారు. రైల్వే ఉన్నత అధికారులతో తాను చేసిన ప్రాతినిధ్యం మూలంగా, విశాఖపట్నం- పలాస డి ఎo యు పాసింజర్ జూలై 1 నుండి పట్టాలెక్కనుందన్నారు.ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో 14 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లకు త్వరలో హల్ట్ సౌకర్యం కలగనుందని తెలిపారు.ఇందుకు తూర్పుతీర ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పొందూరు సమీపంలో ఊసవానిపేట వద్ద రూ.42 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తూర్పు తీర రైల్వే ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఆర్.ఓ.బి ఏర్పాటు కానుందని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ఇతర అధికారులు దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తిచేసినట్లు ఆయన చెప్పారు.ఆమదాలవలస రోడ్ అండర్ టన్నెల్ లో నీటి నిల్వ సమస్య ఉందని, నీరు నిలిచిపోవడంతో కొన్నిసమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు..ఆధునిక పరికరాల సహాయంతో వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూస్తామని, డి ఆర్ ఎం స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఈ దిశగా పనులు కూడా ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, జె కె వెంకబాబు,గురుగుబెల్లి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూసుమంచి శ్యాం ప్రసాద్, శిల్లా మళ్ళీ,బొడ్డేపల్లి రవి కుమార్, బొడ్డేపల్లి నారాయణ రావు తదితర వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.