పార్వతిపురం మన్యం జిల్లాలో దోమల నియంత్రణకు చేపడుతున్న చర్యలలో భాగంగా జరుగుతున్న పారిశుధ్యం, స్ప్రేయింగ్ పనులను సబ్ కలెక్టర్ భావన తనిఖీ చేశారు. స్ప్రేయింగ్ పనులు సక్రమంగా జరుగాలని, దోమల నియంత్రణకు స్ప్రేయింగ్ ప్రక్రియ ముఖ్యమని తెలిపారు. స్ప్రేయింగ్ జరుగుతున్నప్పుడు స్థానిక వైద్యసిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితర సంబందిత శాఖల సిబ్బంది పర్యవేక్షణలో జరుగాలని, అధికారులు తనిఖీ నిర్వహించాలని తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ ఏడవ వార్డులో రెవెన్యూ డివిజినల్ అధికారి కె. హేమలత పారిశుధ్యం, స్ప్రేయింగ్ పనులను తనిఖీ చేశారు. పారిశుధ్యం నిర్వహణపై మాట్లాడుతూ చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. కాలువలలో చెత్త లేకుండా చూడాలని, మురుగు నీరు సక్రమంగా పారేలా చూడాలన్నారు. ప్రజలు ఇంటిలోని చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా విభజించి పారిశుధ్య సిబ్బంది కి అందించాలని సూచించారు.
పారిశుధ్య నిర్వహణపై జిల్లాలో కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా మున్సిపాలిటీలలో మరింత పకడ్బందీగా నిర్వహించాలని డివిజనల్ అధికారులకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే. పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు ఇద్దరు రెవిన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. పార్వతీపురం వరహాల గెడ్డ దశాబ్దాల కొలది పూడిక తీతకు నోచుకోలేదు. అటువంటి పనులను ఈ ఏడాది చేపట్టి పారిశుధ్యానికి మరీ ముఖ్యంగా వరద నీరు వచ్చినా పట్టణానికి ఇబ్బంది లేకుండా చేశారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వలన మురుగు నీరు పారుటకు ఇబ్బంది కరంగా ఉండటం, పారిశుధ్యం కోపంలో వాటి పాత్ర ఎక్కువగా ఉండటం పట్ల జిల్లా యంత్రాంగం శ్రద్ద వహించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు పారిశుధ్య నిర్వహణలో సహకారం అందించి, పరిశుభ్రమైన పట్టణాలు, గ్రామాలు ఆవిర్భావానికి, అంటువ్యాధుల ప్రభావం లేకుండా ఉండటానికి తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు.