సాలూరు మండలం మరిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర గురు వారం పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రోజు రోజుకు నిత్య నూతనంగా సాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ తమకు అందినవి, కావలసినవి తెలియజేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఉంటే పథకాలు మంజూరు అవుతాయని ఆయన పేర్కొన్నారు. గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం నుండి లబ్ధి కలిగిందని వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు.
ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని, సొంత ఇంటికి యజమాని కావాలని ఆయన కోరారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం క్రింద జిల్లాలో 180 మంది చేనేతకారులకు రూ.43.20 లక్షలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు జరిగిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.