విశాఖ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వైయస్సార్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం మూడవ జోన్ 17వ వార్డు పరిధిలోని శివాజీ పార్కు పునరాభివృద్ధి పనులకు విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ గేదెల లావణ్య తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ఎన్నో ఏళ్లగా అభివృద్ధికి నోచుకొని ఉన్న శివాజీ పార్కును సుమారు రూ. 153.30 లక్షల వ్యయంతో పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ముఖ్యంగా వాకింగ్ ట్రాక్, పిల్లల ఆడుకునే సామగ్రి, బెంచీలు, మరుగుదొడ్లు, గ్రీనరీ, తాగునీటి సదుపాయం, వ్యాయామ పరికరాలు ఏర్పాటు లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పార్కు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు గేదెల నాగరాజు, కార్పొరేటర్ నెక్కల లక్ష్మి సురేష్, పర్యవేక్ష ఇంజనీర్ సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.