రూ.6,540 కోట్లతో మౌళిక సదుపాయాలు..


Ens Balu
1
2020-10-06 19:11:24

ఏఐఎఫ్ ప‌థ‌కం క్రింద జిల్లాలో రైతాంగానికి భారీ ఎత్తున మౌలిక వ‌స‌తులు  క‌ల్పించేందుకు త‌గిన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌ (రెవెన్యూ, రైతు భ‌రోసా) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. వివిధ వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌లు, బ్యాంకు అధికారుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం ఏఐఎఫ్ ప‌థ‌కంపై మొట్ట‌మొద‌టి స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెసి మాట్లాడుతూ ప‌థ‌కం అమ‌ల్లో బ్యాంకుల‌దే కీల‌క పాత్ర అని స్ప‌ష్టం చేశారు. కోత అనంత‌రం, స‌రైన స‌మ‌యంలో విక్ర‌యించేందుకు అనువుగా పంట‌ను నిల్వ‌చేసుకోవ‌డానికి, నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌డానికి, మార్కెటింగ్‌, ప్రాసెసింగ్ త‌దిత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డానికి కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని రూపొందించింద‌ని చెప్పారు. ప‌థ‌కాన్ని స‌కాలంలో, స‌క్ర‌మంగా ఉప‌యోగించుకోగ‌లిగితే జిల్లాకు సుమారు రూ.500 కోట్లు వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. జిల్లాలో ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి విభిన్నంగా, వినూత్నంగా కొత్త యూనిట్ల స్థాప‌న‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని సూచించారు. కేవ‌లం వ్య‌వ‌సాయానికే కాకుండా, ఉద్యాన‌, పాడి, మ‌త్స్య‌, ప‌ట్టు, మార్కెటింగ్ త‌దిత‌ర అనుబంధ శాఖ‌ల్లో కూడా కొత్త ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసి, అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు కృషి చేయాల‌ని జెసి కోరారు.   ముందుగా నాబార్డు ఎజిఎం హ‌రీష్ మాట్లాడుతూ ప‌థ‌కం వివ‌రాల‌ను వెళ్ల‌డించారు. అనంత‌రం వ్య‌వ‌సాయ‌శాఖ జెడి ఎం.ఆశాదేవి, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, ఉద్యాన‌శాఖ డిడి ఆర్‌.శ్రీ‌నివాస‌రావు, మార్కెటింగ్ ఏడి వై.వి.శ్యామ్‌కుమార్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, మ‌త్స్య‌శాఖ ఎఫ్‌డిఓ కిర‌ణ్‌కుమార్, కెల్ల పిఏసిఎస్ అధ్య‌క్షులు కెవి సూర్య‌నారాయ‌ణ‌రాజు త‌దిత‌రులు ఈ ప‌థ‌కం అమ‌లుపై ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇంకా స‌మావేశంలో ఎల్‌డిఎం కె.శ్రీ‌నివాస‌రావు, వివిధ పిఏసిఎస్ ల అధ్య‌క్షులు డి.శ్రీ‌ధ‌ర్‌, టి.వెంక‌ట‌నారాయ‌ణ‌రాజు, డిడిఏ ఎం.ఆనంద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.