ప్రజల ఆస్తుల పరిరక్షణకే భూముల రీసర్వే..
Ens Balu
3
బొండపల్లి
2020-12-23 19:53:08
ప్రజల ఆస్తులకు శాశ్వత హక్కు, రక్షణ కల్పించడానికే రీ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాద యాత్ర లో భూ సమస్యల పై ప్రజల ఆవేదనలను విని మేనిఫెస్టో లోనే సుపరిపాలన, రీ సర్వే లను పొందుపరచడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారంగానే రాష్ట్రమంతటా రీ సర్వే జరపడం జరుగుతోందని మంత్రి అన్నారు. బొండపల్లి మండలం తమటాడ గ్రామంలో వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా కార్యక్రమాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. సర్వే రాయిని వేసి భూమి పూజ చేసారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రమంతటా వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు తో 4500 బృందాలతో 17 వేల గ్రామాల్లో ఈ సర్వే మూడు దశలలో జరిగి జనవరి 2023 నాటికీ ముగుస్తుందని తెలిపారు. ప్రభుత్వమే సరిహద్దులను నిర్ణయించి, సర్వే రాళ్ళను ఉచితంగా వేసి హక్కు దారునికి అందిస్తుందని తెలిపారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి మొబైల్ కోర్ట్ లు వస్తాయని, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తారని, ఏ ఒక్కరు వేరే కోర్ట్లకు గాని, పోలీస్ స్టేషన్ లకుగాని వెళ్ళే అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దూర దృష్టి తో అలోచించి ప్రజలకు మేలు జరిగేలా ఈ పధకాన్ని తీసుకు వచ్చిందని తెలిపారు. ప్రతిపక్షం అవాస్తవాలను చెప్తూ తప్పుడు రాతలు రాయిస్తుందని అన్నారు. అవకాశం ఉన్నపుడే ప్రజలకు మేలు జరిగే పనులు చేసి వారి మనస్సులో శాశ్వతంగా నిలిచి పోవాలని అన్నారు. తమటాం గ్రామం లో 466 ఎకరాల్లో సర్వే చేయనున్నామని, ఈ సర్వే మీకు కావాలా వద్దా అని వేదిక పై నుండి మంత్రి అడుగగా కావాలి కావాలి అంటూ ప్రజలు హర్ష ధ్వానాల మధ్య తెలియజేసారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలను మెరిట్ ప్రాతిపదికన, పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. అనేక మంది యువకులు తమ కర్తవ్యాలను చిత్త శుద్ధితో చేసి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. గతం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా లంచాలు లేకుండా దొరికేవి కాదని ఎద్దేవా చేసారు. ముక్కోటి ఏకాదశి పర్వ దినాన పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా పేదల స్వంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు.
సభాధ్యక్షత వహించిన గజపతి నగరం శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య మాట్లాడుతూ సర్వే లో భూ సమస్యలు బయట పడతాయని, ఏమైనా ఉంటె సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలనీ తెలిపారు. వంద సంత్సరాల క్రితం జరిగిన సర్వే వలన నిజమైన హక్కు దారునికి ఇప్పటికి పట్టా దొరక లేదని, ఈ సర్వే తో శాశ్వత పట్టాను పొందుతారని అన్నారు. గజపతి నగరం నియోజక వర్గానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 630 కోట్ల పనులు జరిగాయని తెలిపారు. రహదారుల కోసం సుమారు 200 కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. బొండపల్లి నుండి తమటాం రహదారిని పిఎంజిఎస్వై క్రింద వచ్చే ఏడాది లోగ పూర్తి చేస్తామని తెలిపారు. డిగ్రీ కళాశాల మంజూరు, , 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అవినీతి రహిత పాలననందిస్తూ , ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ మాట్లాడుతూ సమగ్ర శాస్త్రీయంగా భూ సర్వే ను జరిపి యజమానులకు శాశ్వత హక్కును కల్పించిన ప్రబుత్వానికి రుణ పది ఉంటామని అన్నారు. రైతు బాందవునిగా జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తించారని, రైతు భరోసా కేంద్రాల ద్వార రైతు ముంగిటకే సేవలను అందించడమే కాక రైతు భరోసా, నష్ట పరిహరాలను, జల కళ ద్వార ఉచిత బోరు, మోటార్ ను అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రతి పట్టాదారునికి ఆనందం కలిగే రోజు వస్తుందని అన్నారు. పురపాలక శాఖ లో దేశ వ్యాప్తంగా 9 అవార్డులు రాగా ఆంధ్ర ప్రదేశ్ కే 6 అవార్డులు రావడం విశేషమని, మంత్రి గారి పట్టుదల, కృషి, శ్రమ , నిజాయితీ కి ఇది నిదర్శనమని అన్నారు. ఏ శాఖ నైన సమర్ధవంతంగా నిర్వహించే మంత్రిగారి జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ సమావేశం లో శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, సబ్ కలెక్టర్ విధేకర్ , ఆర్.డి.ఓ భవాని శంకర్, కే.ఆర్.సి ఉప కలెక్టర్ బలత్రిఉపుర సుందరి, మండల ప్రత్యేకాధికారి నాగమణి, సర్వే అండ్ ల్యాండ్ శాఖ ఎ.డి పోలరాజు, తహసిల్దార్, ఎం పి డి ఓ , మాజీ సర్పంచ్ లు, ఎం పి పి లు, సర్వేయర్లు, ప్రజలు పాల్గొన్నారు.