తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి..
Ens Balu
4
Karapa
2021-02-27 13:27:45
ప్రభుత్వం నుంచి స్థలాలు పొందిన వారంతా గృహ నిర్మాణ పనులు వేంటనే చేపట్టాలని లబ్ధిదారులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి కోరారు. శనివారం ఉదయం ఆమె కరపలో పర్యటించి, 136 .52 ఎకరాల విస్తీర్ణంలో 14 లేఅవుట్లుగా వేసిన సెంట్రల్ లే అవుట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకా 74.37 ఎకరాలు లెవిలింగ్ చేయాల్సి ఉందని, డ్రైనేజ్ ఉండటంతో పనులు ఆగిపోయాయని డిప్యూటీ తాసిల్దారు పొన్నమండ శ్రీనివాస్ ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే డ్రైనేజీ ఏఈ ని పిలిచి వారం రోజుల్లో డ్రైనేజ్ వద్ద గట్ల నిర్మాణం పూర్తి చేయాలని, గ్రావెల్ లారీలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే పలుచోట్ల విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండడంతో వాటిని ప్రక్కకు జరిపేందుకు పనులు వేంటనే ప్రారంభించాలని ట్రాన్స్ కో ఏఈ ప్రసాద్ కు సూచించారు. లెవిలింగ్ పనులు జాప్యం కావడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా శాఖల సమన్వయంతో వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ తాసిల్దారు, ఎంపిడిఓ కర్రే స్వప్న లకు సూచించారు. ఈ సందర్భంగా జేసి(డి) పలువురు లబ్ధిదారులతో మాట్లాగా ప్రస్తుతం మూఢం, మంచి రోజులు కాకపోవడంతో ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించలేమని లబ్దిదారులు పేర్కొన్నారు. అయితే వర్షాకాలం వస్తే పనులు జరగవని, మహాశివరాత్రి మంచి రోజు అయినందున ఆరోజు నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులకు ఇసుక కూపన్లు ఇస్తామని రవాణా చార్జీలు లబ్దిదారులే భరించాలి అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతం అయినందున మెరక చేసుకోవాలని రూ 20 వేలకు మించి ఖర్చు కాదని సూచించారు. అవసరమైతే డ్వాక్రా రుణాలను ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు. శ్రీ రామనవమి వెళ్లే వరకు తాము పనులు చేపట్టలేమని లబ్ధిదారులు తెలపగా సొంత ఇంటి నిర్మాణం తొందరగా చేసుకుంటే ఇళ్ల అద్దెలు చెల్లించే బాధ తప్పుతుంది కదా... ఆలోచించండని అని వారికి అవగాహన కల్పించారు. ఇటుక, ఇసుక, మెటల్ తక్కువ ధరలకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. కొందరు లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించేందుకు ముందుకు రాగా జెసి కీర్తి వారిని అభినందించారు. మొత్తం స్థలాలు పరిశీలించి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పిడి జివి ప్రసాద్, కాకినాడ, రామచంద్రపురం డివిజన్ల ఈఈ రఘురాం, డిఈ కె.వి.ఆర్ గుప్తా, ఏఈ సోమిరెడ్డి, ఆర్ఐ పేపకాయల మాచర రావు, విఆర్వో భద్రిరాజు చండీ, కార్యదర్శి గొలకోటి త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.