సమాచారం ఇచ్చేది గ్రంథాలయమే..
Ens Balu
4
Visakhapatnam
2021-03-08 13:09:32
చట్టంతో సంబంధం లేకుండా విద్యావంతున్ని చేసేదీ.. హక్కులతో నిమిత్తం లేకుండా సమాచారం ఇచ్చేదీ పుస్తకమేనని ఆంధ్రా మెడికల్ కాలేజీ, కింగ్ జార్జి ఆసుపత్రి (కెజీహెచ్) ఎండొక్రైనాలజీ విభాగం అధిపతి కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలోని గ్రంధాలు, పత్రికలు, పోటీ పరీక్షలు, ఆన్లైన్ విభాగాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే పుస్తక పఠనం అవసరమన్నారు. నిరుద్యోగులు ఆన్లైన్లో పుస్తకాలు అందించే వెబ్సైట్లను వినియోగించుకోవాలని చెప్పారు. పాత పుస్తకాలను దానం చేయడానికి బడ్జెట్ రీడ్స్, బుక్ చోర్ వెబ్సైట్లను సంప్రదించవచ్చన్నారు. పుస్తక పఠనం ద్వారా జీవిత లక్ష్యాన్ని అలవోకగా సాధించవచ్చన్నారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలను తప్పనిసరిగా చదవాలన్నారు. పత్రికలు చదవడం వల్ల సమాజంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై అవగాహన ఏర్పడుతుందని ఆయన చెప్పారు. నిరుద్యోగులకు ఆసరాగా శ్రీ గౌరీ గ్రంథాలయం నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పెంటకోట భోగలింగం జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు గ్రంథాలయానికి అందజేసిన తెలుగు అకాడమీ, పోటీ పరీక్షల పుస్తకాలను ఎండొక్రైనాలజీ విభాగం అధిపతి కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం, ఏపీ వైద్య విధాన పరిషత్ పాడేరు ఆసుపత్రి సూపరింటెండెంట్ కిల్లు కృష్ణారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, సభ్యులు కాండ్రేగుల అప్పారావు (కెప్టెన్), కర్రి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.