శ్రీగౌరీ గ్రంథాలయానికి జీవీఎంసీ చేయూత..
Ens Balu
6
Anakapalle
2021-07-23 15:54:51
నిరుద్యోగులకు శిక్షణాలయంగా సేవలందిస్తున్న శ్రీగౌరీ గ్రంథాలయానికి చేయూతనిస్తామని జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ కొట్యాడ కనకమహలక్ష్మి స్పష్టం చేశారు. శ్రీగౌరీగ్రంథాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాలిటెక్నిక్, ఐఐటీ, గ్రూప్ 1, 2, సివిల్స్ ప్రిలిమినరీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ మొదలగు పోటీ పరీక్షల పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కనకమహలక్ష్మి మాట్లాడుతూ పోటీ పరీక్షల పుస్తకాలతోపాటు వివిధ అంశాల్లో చైతన్యం తీసుకువచ్చే సామెతలు, పొడుపు కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఉన్నత స్థానాలు అధిరోహించిన వ్యక్తుల వైఫల్యాలు, విజయగాథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ నేర్పే పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచాలని ఆమె సూచించారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలను తప్పనిసరిగా చదవాలని, ఫలితంగా కొత్త విషయాలతోపాటు మన చుట్టూ జరిగే విషయాలు తెలుస్తాయన్నారు. పత్రికలు చదవడం వల్ల సమాజంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులు ఆన్లైన్లో పుస్తకాలు అందించే వెబ్సైట్లను వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్ధులు తమకు కావాల్సిన పుస్తకాలను ఆన్లైన్లో వెతకడానికి అమెజాన్ యూజ్డ్ బుక్ స్టోర్స్, బకెట్ బోల్ట్, యువర్ బుక్ స్టాల్, యో బుక్స్, సెల్ బై బుక్, ఆల్ బుక్స్ ఆన్లైన్, బుక్ అడ్డా, మై కాలేజ్ అడ్డా, బుక్స్ నెటవర్క్, స్టూడెంట్ డెస్క్, శ్వాప్ ద బుక్, బుక్ మై బుక్, బుక్ సెల్ బై, కితాబి వంటి వెబ్ సైట్లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే పుస్తకాలు కావాలి, ఇలాంటి స్థితిలో శ్రీగౌరీ గ్రంథాలయం నిరుద్యోగుల అవసరాన్ని తీర్చడం అభినందనీయమన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయం అధ్యక్షుడు మళ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడు కర్రి గంగాధర్, సభ్యులు మళ్ల సూరిబాబు, కాండ్రేగుల అప్పారావు (కెప్టెన్), కర్రి హనుమంతరావు, కాండ్రేగుల సత్యనారాయణ (ఎస్.ఎఫ్.ఐ.), బుద్ద జోగినాయుడు, కాండ్రేగుల జగ్గారావు, మారిశెట్టి శివరామకృష్ణ, కర్రి శివ తదితరులు పాల్గొన్నారు.