ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు సత్వరమే పారదర్శకంగా అందించే ఒన్ స్టాప్ సెంటరు గా గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఫిరంగిపురం మండలం లోని రేపూడి గ్రామ సచివాలయంను, రైతు భరోసా కేంద్రంను, మేడికొండూరు మండలంలోని పేరేచర్ల 4వ గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తనిఖీ చేశారు. సచివాలయాల్లో ప్రదర్శించిన సంక్షేమ పథకాల క్యాలండర్లు, సోషల్ అడిట్ నిమిత్తం ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలు, సంక్షేమ పథకాల ప్రచార పోస్టర్లు పరిశీలించారు. సచివాలయం ఉద్యోగులకు శాఖలవారీగా ప్రజల నుంచి అందుతున్న ధరఖాస్తులు, పరిష్కరిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రేపూడి రైతుభరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న సేవలు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాల అమ్మకాల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలు చేయటానికి సచివాలయ వ్యవస్థను, ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీరును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. లబ్ధిదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి సచివాలయంలో ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కోసం సంక్షేమ క్యాలెండరు, పథకాల ప్రచార పోస్టర్లును ప్రదర్శిస్తున్నామన్నారు. సచివాలయాల పనితీరు పై జిల్లాలోని ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన సూచనలు అందిస్తున్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు సైతం ప్రతి రోజు ఖచ్చితంగా సమయాపాలన పాటిస్తూ బయోమెట్రీక్ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కర రెడ్డి, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, ఎంపీడీవో శివప్రసాదు, మేడికొండూరు తహశీల్దారు కరుణకుమార్, ఎంపీడీవో శోభారాణి, సచివాలయ ఉధ్యోగులు పాల్గోన్నారు.