సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి..


Ens Balu
10
Bheemili
2021-08-17 14:51:22

భీమిలీ నియోజకవర్గంలోని జీవీఎంసీ జోన్-1 పరిధిలోని 2వ వార్డులోని తగరపువలసలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానికంగా 20 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం.. 78 లక్షలతో నిర్మిస్తున్న రైతుబజార్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తగరపువలస ప్రజల చిరకాల కోరిక రైతుబజార్ నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో  పేదరిక నిర్మూలనే ముఖ్య మంత్రి లక్ష్యమని అన్నారు. త్వరలోనే మంచినీటి పైపులైన్ల పనులు పూర్తిచేసి భీమిలీ, తగరపువలసలోని ఇంటింటికీ మంచినీరు అందిస్తామని అన్నారు. స్థానికంగా చెక్ డాం కట్టించేందుకు కృషి చేస్తానని అన్నారు. పాండ్రంగి బ్రిడ్జి పూర్తికి.. పద్మనాభస్వామి ఆలయానికి రహదారి నిర్మాణానికి, ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దాట్ల పెదబాబు, జోనల్ కమిషనర్  వెంకటరమణ, ఎమ్మార్వో ఈశ్వరరావు, 1వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి రామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు