సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన గురువారం పార్వతీపురం మండలం వెంకంపేట, చినబొండపల్లి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు. ఈ పర్యటనలో పార్వతీపురం మండలం రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.