విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరిట ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ, ఏపి మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ లు అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావులు ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమములో రామకృష్ణ, చలసానిలు మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు త్యాగ ఫలితం వల్లే నాడు విశాఖ ఉక్కు ఏర్పాటైందన్నారు. తాజాగా దేశములో రైతుచట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా సానుకూల వైఖరి తీసుకోవాలనే తామంతా కోరుకుంటున్నామన్నారు. విశాఖ ఉక్కు పై సుమారు లక్ష కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కువిషయంలో కేంద్రం మరోసారి పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల చిరకాల వాంఛ గా విశాఖ రైల్వేజోన్ మిగిలిపోయింతని వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కేంద్రం ప్రకటించిన విధంగా తక్షణమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు విశాఖ వేదికగా ప్రారంభించాలని అయన కోరారు. ఇందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు వినతి పత్రాలు సమర్పించినట్లు కార్యదర్శి దుర్గారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజేఎఫ్ ఉపాధ్యక్షుడు ఆర్ నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు దొండ గిరిబాబు, రోతి ఈశ్వరరావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, నగేష్ బాబుతదితరులు పాల్గొన్నారు.