జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా గంట్ల.. 2వసారి కీలకబాధ్యతలు అప్పగించిన ఎన్ఏజె..
Ens Balu
9
New Delhi
2022-01-24 06:12:08
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా విశాఖకు (ఆంధ్రప్రదేశ్ ) చెందిన గంట్ల శ్రీనుబాబును నియమిస్తూ జాతీయ జర్నలిస్టుల సమాఖ్య (నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్ఏజె అధ్యక్షులు ఎస్.కె.పాండా సోమవారం ఢిల్లీలో ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా పాండా వెల్లడించారు. నగరానికి చెందిన గంట్ల శ్రీనుబాబు 24 ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ సుమారు 20 ఏళ్లుగా అనేక యూనియన్లకు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్ఏజెకు జాతీయ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్) రాష్ట్ర కార్యదర్శిగా, కీలకమైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే మరోసారి శ్రీనుబాబు సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించి ఎన్ఎజె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాండా వెల్లడించినట్లు శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా తనను నియమించిన ఎన్ఏజె అధ్యక్షులు ఎస్.కె.పాండాతో పాటు జాతీయ సమాఖ్య కార్యవర్గానికి శ్రీనుబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను రాష్ట్రస్థాయి కార్యవర్గంతో పాటు జాతీయ స్థాయి కార్యవర్గంలోనూ కొనసాగుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనను జాతీయ స్థాయి కార్యవర్గానికి ప్రతిపాదించిన ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులతో పాటు ఎన్ఏజె కోశాధికారి ఆకుల అమరయ్య, రాష్ట్ర కార్యవర్గానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పెందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తాను నాయకత్వ బాధ్యతలు తొలిసారిగా చేపట్టడం జరిగిందని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా మూడు పర్యాయాలు, రాష్ట్ర కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేయడం జరిగిందని, ప్రతిష్టాత్మకమైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శిగా, తదుపరి అధ్యక్షులుగా తన వంతు సేవలందించడం జరుగుతూ వస్తుందన్నారు. రెండోసారి జాతీయ స్థాయి కార్యవర్గంలో తనకు అవకాశం కల్పించారన్నారు. ఇందుకు సహకరించిన జాతీయ స్థాయి నేతలతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలకు తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలుతో పాటు భవిష్యత్తులో కూడా తన వంతు సేవలు జర్నలిస్టులకు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు నేవల్ డాక్ యార్డ్ ఉద్యోగుల కేటీబీ సంఘం గౌరవ అధ్యక్షుడిగా, పోర్టు ట్రస్టు సలహాదారుగా సేవలందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. వీటితో పాటు పలు ఆలయాలు ధర్మకర్తల మండల్లు గౌరవ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న ట్లు చెప్పారు.. తన కెరీర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నుంచి మూడు సార్లు రాష్ట్ర స్థాయ అవార్డ్ లు, జాతీయం స్థాయిలో వేర్వేరు సంస్థల నుంచి , వివిద సంస్థల నుంచి మొత్తం 26 అవార్డ్లు స్వీకరించడం జరిగిందన్నారు.. ప్రతీ ఒక్కరు సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగామన్నారు.