పూర్వీకులు మనకు అందించిన విజ్ఞానాన్ని పరిరక్షించి, భావితరాలకు అందివ్వాలని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన సంస్థను శనివారం సాయంత్రం ఈవో పరిశీలించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ సహకారంతో పురాతన తాళపత్ర గ్రంథాలను డిజిటైజేెషన్ చేసి పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య పరిశోధన సంస్థలో 16వ శతాబ్ధం నుండి దాదాపు 60 వేల తాళపత్ర గంథ్రాలు, 4 వేల కాగితపు ప్రతులు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ప్రాచ్య పరిశోధన సంస్థ లైబ్రరీలోని తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ భాషల్లోని వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహా భారతం, భాగవతం, పురాణాలు, ఇతిహసాలు, చరిత్ర,, వృక్ష శాస్త్రం, ఆయుర్వేదం, ఆముక్తమాల్యద, విజయ విలాసం, నాగానందం, తదితర అరుదైన గ్రంథాలను ప్రపంచానికి అందివ్వాలని ఎస్వీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజారెడ్డిని ఈవో కోరారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను, డిజిటైజేషన్, గ్రంథాల పరిరక్షణను ఈవో పరిశీలించారు. జెఈవో వీరబ్రహ్మం, ప్రాచ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి, విశ్వవిద్యాలయం సలహాదారు సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.