ఆ హోటల్ లో ఫ్రీగా భోజనం చేయొచ్చు..


Ens Balu
12
Agra
2022-04-29 06:16:31

మథుర నుండి ఆగ్రా దారిలో ఫరా  గ్రామం ఉంది. ఫరా దాటాక  రహదారిపై "బ్రజ్ కీ రసోయి " పేరు గల రెస్టారెంట్ కనిపిస్తుంది. హోటల్ పేరు ఉన్న పెద్దబోర్డు  పై "మట్టిపాత్రలలో  వడ్డించబడును" అని కూడా రాసి ఉంది. 25 ,26 తేదీల్లో మథుర లో జరిగిన ఐ.జే.యు. జాతీయ కార్యవర్గసమావేశాలు   ముగిసాక  ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , మహారాష్ట్ర , రాష్ట్రాల ప్రతినిధులం పదకొండు మంది 27 వ తేదీ ఉదయం మథుర నుండి ఆగ్రా బయలుదేరాం. బ్రేక్ ఫాస్ట్ కోసం మా డ్రైవరు "బ్రజ్ కీ రసోయి"  దగ్గర ఆపాడు. మట్టిపాత్రల  వడ్డన గురించిన ప్రకటన కొంచెం  ఆసక్తి కలిగించింది. లోనికి వెళ్ళేసరికి గోడల నిండా ప్రముఖ యత్రాస్థలాల పెద్ద పెద్ద చిత్రపటాలు  అలంకరించి ఉన్నాయి. అందులో లక్ష్మీనారాయణ మందిర్ పటం కూడా ఉంది. ఆపటం పై హిందీలో రాసిన మరో ప్రకటన ఇంకా ఆసక్తి కలిగించింది. "ఎవరైనా పరదేశీయులు డబ్బులు లేకపోతే ఆ విషయాన్ని ముందుగా చెప్పి భోజనం చేయవచ్చు" అని ఆ ప్రకటన సారాంశం ! ఆశ్చర్యం కలిగించిన ఆ విషయం గురించి తెలుసుకోవాలని కుతూలం కలిగింది. మా బృందం కోసం "చోలే బటురా" ఆర్డర్ ఇచ్చాం! కౌంటర్ లో కూచున్న సుబేదార్ ఠాకూర్ ని మాటల్లోకి దింపాను! తన అన్నగారయిన  విమల్ ఠాకూర్ హోటల్ కు యజమాని అనీ , హిందూస్థాన్ దినపత్రిక కు ఫరా బ్లాక్ కేంద్రానికి విలేఖరిగా  పనిచేస్తున్నారని చెప్పారు. "మేంకూడా   పాత్రికేయులమే , విమల్ ఠాకూర్ తో మేం  మాట్లాడవచ్చా"   అని అడిగాను. సుబేదార్ ఠాకూర్ తన అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇరవై నిముషాల్లో వస్తానని ఆయన చెప్పారు. ఆబోర్డు  మీద ఉన్న ప్రకటన గురించి సుబేదార్ ను అడిగాను. ఆయన ఆ ప్రకటన నేపథ్యాన్ని , తన అన్నగారి సేవా కార్యక్రమాల గురించి  ఉత్సాహంగా వివరించారు. సైకిల్ పై దేశయాత్ర  చేస్తున్న ఒక వ్యక్తి కొన్నేళ్ళక్రితం  ఆ హోటల్ కు వచ్చారట.

భోజనానికీ సరిపడా తనదగ్గర   డబ్బులు లేకపోవడంతో కొన్ని ఐటమ్స్ తగ్గించి తక్కువధరకు  భోజనం పెడతారా అని ఆ యాత్రికుడు అడిగాడట! కౌంటర్ లో ఉన్న  విమల్ ఠాకూర్ ఆ సైకిల్ యాత్రీకుని   వివరాలన్నీ తెలుసుకుని  , తనదగ్గరకు వచ్చిన ఒకయాత్రికుడు ఆకలితో వెళ్ళిపోవడం ఇష్టంలేక  ఉచితంగా భోజనంపెట్టి  పంపించారు.  చాలామంది యాత్రీకులు డబ్బులు లేక ,  ఉచితభోజనం కోసం యాచించలేక   భోజనం చేయకుండా  ఆకలితోనే   వెళ్ళిపోతారు కదా ,  వారి పరిస్థితి ఏమిటోనని   విమల్ ఠాకూర్ కు ఆలోచన వచ్చింది.
దాంతో డబ్బులు లేకపోయినా యాత్రికులకు భోజనం పెట్టాలన్న తలపు కలిగింది. ఆరోజే  తనహోటల్లో  ఆప్రకటన  రాయించారు.  తరచూ ఎవరోఒకరు వచ్చి ఉచిత భోజనం చేసి వెళ్తుంటారట. ఒక్కోసారి నలుగురైదుగురు కూడా ఆ సదుపాయాన్ని   వినియోగించు కుంటారట! ఇంతలో అడ్డాకు విస్తరిలో వడ్డించిన  మా టిఫిన్ వచ్చింది. మట్టిచట్టిలో కూరతెచ్చి ఇచ్చారు. నా  బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యేసరికి  విమల్ వచ్చారని సిబ్బంది చెప్పారు. హోటల్ భవనం షట్టర్లలో  చివరి షట్టర్ వైపుగా  చూపించారు. బైట హిందూస్థాన్ విలేఖరి అంటూ ఒక బోర్డు కూడా ఉంది. లోన కూచున్న నలభై ఏళ్ళ  విమల్ ఠాకూర్  నన్నూ , నాతో పాటు వచ్చిన ఖమ్మం మిత్రుడు రామ్ నారాయణ్ ను "రాధే రాధే"  అంటూ  సాదరంగా లోనికి  ఆహ్వానించారు. మథుర ప్రాంతంలో "రాధే రాధే"  అనేది సంబోధనాపదం. చాలా సేపు  ముచ్చటించాం !

ఆయన వివరాలన్నీ తెలుసుకున్నాం ! ఫరా గ్రామానికి దగ్గర్లోనే ఉన్న రెండువందల కుటుంబాలు ఉన్న  నాగలా చంద్రభాన్ గ్రామం తనది. ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతకర్తలలో  ఒకరు , భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వగ్రామం అది. ఆ గ్రామంలోని ఒక పేద  రైతుకుటుంబంలో విమల్ ఠాకూర్  పుట్టాడు. ఆరుగురు సోదరులలో  పెద్దవాడు. ఒక చెల్లికూడా ఉంది. తినడానికి తిండి కూడా కష్టమైన కుటుంబం అది. రెక్కలకష్టమే జీవనాధారం. తల్లితండ్రులు ఎంతో  కష్టించారు. బడికి వెళ్ళడానికి కనీసం  యూనిఫారం ,చెప్పులులేని స్థితిలో  విమల్ ఎంతో  కష్టపడి చదువుకున్నాడు. బీఎస్సీ , బి.ఇడి , ఎం. ఏ. చదివాడు. ఊళ్ళోవాళ్ళ  ఆర్థికసహాయంతో  హోటల్  వ్యాపారాన్ని  చిన్నస్తాయిలో ప్రారంభించారు. అది విజయవంతం  అయ్యింది. ఇంకా రకరకాల పనులు చేశారు. కుటుంబం అంతా కష్టపడ్డారు. ఇప్పుడు ఒకస్థాయికి ఎదిగారు.
2008 లో విమల్ ఠాకూర్  హిందూస్థాన్ పత్రికకి "ఫరా " బ్లాక్ కేంద్రం విలేఖరి అయ్యారు.

"హిందూస్థాన్"  అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక కావడంతో  దాని విలేఖరిగా అధికారులతో ,  ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ లు , ప్రజలు  ఏ సమస్యవచ్చినా విమల్ ఠాకూర్ దగ్గరికే వస్తారు. తనకున్న పరిచయాలను వినియోగించి వీలయినమేరకు  ఆయన  వాటిని పరిష్కరిస్తూ ఉంటారు. పోలీస్ కేసులు , అనారోగ్యాలు , త్రాగునీరు , రైతులకు విద్యుత్ సరఫరా, నీటిపంపులు , రహదారులు , బడుల్లో సదుపాయాలు ,లాంటి సమస్యల పరిష్కారంలో విమల్ ఠాకూర్ తనవంతు సహాయం చేస్తుంటారు. మథుర - ఆగ్రా ప్రధాన రహదారి , రైల్వే లైన్ కూడా ఫరా  గ్రామం మీదుగా పోతుండటంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ప్రమాదాల్లో చనిపోతుంటారు. శవపంచనామా  , పోస్ట్ మార్టం , దర్యాప్తుతో   పాటు వాటి అంతిమ సంస్కారాలు చేసే పనికూడా  పోలీసులే చూడాలి. పోలీసుల దగ్గర అందుకు అవసరమైన సొమ్ము ఉండదు. ఈ లేనిపోని తలనొప్పిని  తప్పించుకోవడానికి పోలీసులు అన్ని చోట్లా చేసేపని ఒక్కటే. తమ స్టేషన్ పరిధి నుండి శవాలను పక్క స్టేషన్ పరిధిలోకి పోయేటట్లు చేయడానికి కాల్వల్లో పడేస్తారు.  వారికి కేసుగొడవా  ఉండదు.
డబ్బుఖర్చు  గొడవా ఉండదు. విలేఖరిగా తరచూ  ఈ వ్యవహారాలను  చూసిన విమల్ ఠాకూర్  శవాల అంతిమ సంస్కారాల బాధ్యత తన  భుజాలపై వేసుకున్నారు. ప్రతి అంతిమ సంస్కారానికి 3500 రూపాయల చొప్పున  ఖర్చుచేస్తూ ఇంతవరకూ  100 వరకూ  మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తనకున్న పరిచయాలను వినియోగించి గ్రామాల్లో మహిళలకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. జిల్లాలో బడిపిల్లల యూనిఫారం కుట్టే పనిని కాంట్రాక్టు  తీసుకుని యాభైమంది  గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించారు. వితంతువులు ,  యజమాని అనారోగ్యంతో మంచానబడిన  కుటుంబాల స్త్రీలు ఇంటిదగ్గర కూచుని యూనిఫారం కుట్టే పని చేసుకునే విధంగా వారికి కుట్టు మిషన్లు  అందచేశారు. తనహోటల్లో మట్టిపాత్రల వాడకం వెనకఉన్న కథను కూడా విమల్ చెప్పారు. తమగ్రామానికి  చెందిన కుమ్మరి (ప్రజాపతి) కుటుంబానికి చెందిన 28 ఏళ్ళ యువకుడు ప్రమాదంలో మరణించాడు.
తల్లితండ్రులు  , అన్నదమ్ములు , భార్యాబిడ్డలు   మొత్తం 12 మంది సభ్యులున్న కుటుంబం అది.

జీవనాధారంగా  ఉన్న కొడుకు కాస్తా చనిపోవడంతో వృద్ధాప్యంలో పెద్దాయన  మళ్లీ కుటుంబభారాన్ని  నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. విమల్ ఠాకూర్ ఆయనకు అండగా నిలిచారు.
పెద్దాయనకు మోటారుతో  తిరిగే పాటర్స్ వీల్ ను కొనిపెట్టారు.  తనహోటల్లో వాడుతున్న  క్రోకరీని పక్కనపెట్టారు. మట్టిపాత్రల వినియోగం మొదలు పెట్టారు. చెక్కగరిటలు , చెక్కచెంచాలు కూడా ప్రవేశపెట్టారు. కరోనా వచ్చాక మట్టి పాత్రల ,చెక్క వస్తువుల ప్రయోగానికి ఆదరణ లభించింది. నెలకు 40 వేల రూపాయల ఆర్డర్ ను పెద్దాయనకు ఇస్తున్నట్లు విమల్ చెప్పారు.
ఫీజు కట్టలేని ,పుస్తకాలు కొనుక్కోలేని పిల్లల చదువులకు కూడా సహకారం అందిస్తున్నారు. గ్రామసర్పంచ్  గా పోటీ చేయాల్సిందిగా వివిధ పార్టీల నాయకులూ , గ్రామస్తులూ ,  కోరినా విమల్ ఠాకూర్ అంగీకరించలేదు. తనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ భావజాలంపై అభిమానం ఉంది. దీన్ దయాళ్ చెప్పిన  "అంత్యోదయ" భావన తనకు నచ్చిందని , తన పరిధిలో పేదలకు సహకరించే పని చేస్తున్నానని విమల్ చెప్పారు. ఒకప్పుడు సంఘ్ లో ప్రచార కార్యదర్శిగా పనిచేసినా బీజేపీలో సభ్యునిగా చేరలేదనీ  విమల్ చెప్పారు. తనగ్రామం  నుండి ఎవరు ఎన్నికైనా గ్రామానికి సంబంధించిన పనుల్లో  వారికి విమల్  సహకరిస్తూ ఉంటారు. మేం ఆయనతో  మాట్లాడుతుండగానే వేరే గ్రామానికి చెందిన  బీజేపీ సర్పంచ్ ఒకాయన అనుచరులతో  ఏదో పనిపై విమల్ దగ్గరకు వచ్చారు. 

"పేదరికం నుండి వచ్చాను , ఆకలి అంటే ఏమిటో నాకు   తెలుసు అందుకే చేతనైన మేరకు సేవ చేస్తున్నాను, కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టడం ముఖ్యం, దానిపై దృష్టి పెడుతున్నాను " అన్నారు విమల్ ఠాకూర్. మేం టీ త్రాగిన తర్వాత ఆయన కార్యాలయం నుండి హోటల్లోకి వచ్చాం ! అప్పటికి  మాబృందం  కూడా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసింది.
ఐ.జే.యు. అధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి , ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు , సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి , ఆలపాటి సురేష్ కుమార్ , వై.నరేందర్ రెడ్డి , నల్లి ధర్మారావు , కే. రామ నారాయణ , చెన్నుపాటి  రాంబాబు , మహారాష్ట్ర కు చెందిన జి. శ్రీనివాస్ , ప్రమోద్ కరాత్ , సహా మా బృందసభ్యులను  పరిచయం చేశాను. జాతీయస్థాయి నాయకులు , వివిధ రాష్ట్రాల సీనియర్ పాత్రికేయులు తన హోటల్ కి రావడం ఎంతో  సంతోషం కలిగిస్తోందని విమల్ ఠాకూర్ అన్నారు. సుమారు గంటసేపు "బ్రజ్ కి రసోయి" లో గడిపిన మేం విమల్ ఠాకూర్ కు , అతని సోదరునికి  సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాం! అందరికీ "రాధే రాధే"  అంటూ అభివాదం చేస్తూ విమల్  వీడ్కోలు పలికారు. నలభైఏళ్ల వయసున్న ఒక గ్రామీణ విలేఖరి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్న  తీరు ,ఇతరులకు  సహాయం చేస్తున్నతీరు  అద్భుతం అనిపించింది.

రచన, స్వీయ అనుభవం
డి.సోమసుందర్, 
సీనియర్ పాత్రికేయుడు,

సిఫార్సు