యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇపుడు మసగబారుతోంది. కేంద్రప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఉండటంతో దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. యూపీఎస్సీ ద్వారా సమయానికి దేశవ్యాప్తంగా సరిపడా ఐఏఎస్ అధికారుల నియామకం చేపట్టకపోవడంతో రాష్ట్రాల్లోనూ.. కేంద్రంలోనూ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ.. పరిపాలనలోనూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దేశం మొత్తం 28 రాష్ట్రాలు ఉండగా అందులో 26 చోట్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్)ల కొరత నెలకొని ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 కాగా ఉన్నది 5,317 మంఅంటే ఇంకా 1,472 మంది ఐఏఎస్లు కావాలి. ప్రజా సేవకులకు (సివిల్ సర్వెంట్లకు) శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశం ఒక యూనిక్ మోడల్ని ఇటీవలే ప్రారంభించింది.
‘‘నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్”(ఎన్ఎస్సీఎస్టీ) పేరిట సరికొత్త నమూనాను ప్రవేశపెట్టి ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఇండియాలో ఐఏఎస్ల కొరత నెలకొనటం ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతుంది.. 6,789 మందిలో 4,712 మందిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ద్వారా ప్రత్యక్షంగా నియమించుకోవాల్సి వుంది. అలా నియామకాలుపూర్తిచేసిన తరువాతర.. మిగిలినవాళ్లను స్టేట్ సివిల్ సర్వీసెస్ నుంచి ప్రమోషన్లు ఇచ్చి తీసుకోవాలి. దేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతోంది. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలూ మందగిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కనీసం రెండు, మూడు శాఖల బాధ్యతలను అదనంగా చూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో సమగ్ర సమీక్షలు జరపకుండానే ఫైల్స్ని క్లియర్ చేయాల్సి వస్తోందని చీఫ్ సెక్రెటరీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు.
మన దేశంలో బాస్వాన్ కమిటీ సిఫార్స్ల మేరకు 2012 నుంచి ఏటా 180 మంది ఐఏఎస్ ఆఫీసర్లను డైరెక్టుగా నియమించుకుంటున్నామని కేంద్రం చెబుతున్నా.. అయినా ఖాళీలు ఉండటం గమనార్హం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 2016 నుంచి 2020 వరకు 898 మంది ఐఏఎస్లను నియమించుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ఈ నెల 21న రాజ్యసభకు రాతపూర్వకంగా తెలియజేసింది. కానీ..మిగిలిన ఖాళీలను ఎప్పుడు ఏ విధంగా భర్తీ చేస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రాల్లోనూ సీనియర్ ఐఏఎస్ అధికారులు రెండు మూడుశాఖలను చూస్తుంటే..ఇదే విధానం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ కొనసాగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 5317 మంది సివిల్ సర్వెంట్స్లో 3862 మందిని యూపీఎస్సీ ద్వారానే రిక్రూట్ చేసింది కేంద్రం. మిగిలిన 1455 మందిని స్టేట్ సివిల్ సర్వీసెస్ నుంచి పదోన్నతుల ద్వారా నియమించింది. విశేషం ఏంటంటే దేశం మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఐఏఎస్ల కొరత లేకపోవటం విశేషం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో టాప్లో ఉంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్రాల పరిస్థితిని, కేంద్ర ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నా.. ఆయా మంత్రిత్వ శాఖల్లోని పనులు సత్వరమే పూర్తికావాలన్నా మిగిలివున్న 1472 మంది ఐఏఎస్ అధికారులను సత్వరమే భర్తీచేయాల్సిన అవసరం వుంది. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా యూపిఎస్సీ ద్వారా ఐఏఎస్ లను భర్తీచేస్తున్నా ఈ సారి కాస్త రెట్టింపు సంఖ్యలో పూరించాల్సి వుంది. లేదంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పరిపాలన గాడితప్పే ప్రమాదముంది.