తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం, తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఈఓ ఏవీ.ధర్మారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందని, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశామని, ఆర్జిత సేవలు కూడా రద్దు చేశామని వివరించారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకుంటామన్నారు. భద్రత పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపడతామని ఈవో వెల్లడించారు. రెండు రోజుల క్రితం టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్రెడ్డి సంయుక్తంగా మాడ వీధుల్లో తనిఖీలు నిర్వహించి చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారని చెప్పారు. భద్రత అవసరాల కోసం పోలీసు అధికారులు అడిగిన మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సిసి కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు.